- చింతపల్లిలో కరపత్రాల ఆవిష్కరణ
ప్రజాశక్తి-పాడేరు (అల్లూరిజిల్లా) : ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అల్లూరి జిల్లా కలెక్టరేట్ వద్ద జూలై 10,11 తేదీల్లో చేపడుతున్న నిరసనలో అంగన్వాడీ వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చింతపల్లి మండల అధ్యక్షులు పెంటమ్మ, మండల నాయకులు అక్కమ్మ, వరలక్ష్మి తదితరులు పిలుపునిచ్చారు. మంగళవారం నిరసనకు సంబంధించిన కరపత్రాలను ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలని.. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని అన్నారు. ఐసిడిఎస్ పరిరక్షణ కోసం అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కనీస వేతనం పెన్షన్ పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుటి అమలు చేయాలని ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. జులై 10 కోరికల దినం సందర్భంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని అఖిల భారత కమిటీ పిలుపు ఇచ్చిందని తెలిపారు. 13 డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి, రమణమ్మ, రత్నం, ప్రసన్న మిగతా అంగన్వాడీలు పాల్గొన్నారు.










