చెన్నై : నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. తమిళనాడు పర్యటనను ముగించుకుని ఢిల్లీ వెళుతున్న రాష్ట్రపతికి విమానాశ్రయంలో ఈ మేరకు ఆయన ఒక వినతిపత్రం సమర్పించారు. అలాగే రాష్ట్రంలో అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్లో అర్హత సాధించాలనే తొలగించాలని కూడా ముఖ్యమంత్రి ఆ వినతిపత్రంలో కోరారు. రాష్ట్రపతికి వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి, ఇతర అధికారులు కూడా పాల్గన్నారు. తమిళనాడు అడ్మిషన్ టూ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సెస్ బిల్లు 2021 రాష్ట్రపతి ఆమోదం కోసం సంవత్సరానికి పైగా పెండింగ్లో ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 'నీట్ ఆధారంగా వైద్య కోర్సుల ప్రవేశం పేద, వెనుకబడిన విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్లస్ 2 ద్వారా ప్రవేశ ప్రక్రియను తమిళనాడు ఎంచుకుంది. అయితే ఈ ప్రక్రియ కేంద్రం నీట్ను ప్రవేశపెట్టడంతో నిలిచిపోయింది' అని తన వినతి పత్రంలో స్టాలిన్ గుర్తు చేశారు. కాగా, ఈ బిల్లును సెప్టెంబరు 2021న తమిళనాడు అసెంబ్లీలో ఆమోదించి గవర్నరకు పంపారు. ఐదు నెలలు తరువాత గవర్నర్ దీనిని వెనక్కి పంపారు. దీంతో మళ్లీ 2022 ఫిబ్రవరిలో అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపారు. దీంతో గవర్నర్ ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. అప్పటి నుంచి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు అడిగిన వివరణలను తమిళనాడు ప్రభుత్వం వెంట వెంటనే పంపుతూ వస్తుంది. అయినా ఈ బిల్లుకు ఇంకా మోక్షం లభించలేదు. ఈ ఏడాది ఆగస్టు 14న రాష్ట్రపతికి స్టాలిన్ లేఖ రాశారు.. బిల్లు ఆమోదంలో జాప్యం కారణంగా అతి ఖరీదైన కోచింగ్ సౌకర్యాలు పొందలేని అనేక మంది అర్హులైన విద్యార్థులకు మెడికల్ ప్రవేశాలు లేకుండా చేస్తుందని స్టాలిన్ తెలిపారు. ఈ సున్నితమైన సమస్యపై రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకుని, వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని కోరారు.










