విజయవాడ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ట్యాక్స్ రీఫండ్లు, మినహాయింపులు కోరుతూ తప్పుడు రిటర్న్లు దాఖలైనట్టు గుర్తించామని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత తెలిపారు. అర్హతలేని క్లెయిమ్ల ద్వారా పన్ను రీఫండ్, మినహాయింపు పొందినట్టు ఇప్పటికే ఆదాయపన్ను విభాగం గుర్తించిందన్నారు. ఇందులో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, సాఫ్ట్వేర్ రంగంలోని ఉద్యోగులు ఈ తరహా తప్పుడు రీఫండ్లు కోరినట్టు ఐటీశాఖ దర్యాప్తులో తేలిందన్నారు.''రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన మూడేళ్లుగా ఈతరహా తప్పుడు క్లెయిమ్లతో రిటర్నులు దాఖలు చేసినట్టు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించాం. 2022-23లో తప్పుడు రీఫండ్లతో కూడిన రిటర్న్లు 84 శాతానికి పెరిగాయి. తప్పుగా రీఫండ్లు కోరిన ఉద్యోగులకు సవరించిన రిటర్న్లు దాఖలు చేసేందుకు ఐటీశాఖ గడువు ఇచ్చింది. 2023 డిసెంబరు వరకు సవరించిన ఐటీ రిటర్న్లు దాఖలు చేయొచ్చు. ఆ తదుపరి 50శాతం పెనాల్టీతో రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ ప్రాక్టీషనర్స్తో పాటు ట్యాక్స్ పేయర్స్ పై కూడా విచారణ జరుగుతోంది. రెండు.. మూడు సంవత్సరాల వెనక్కి వెళ్లి రిటర్న్లు పరిశీలిస్తాం. టీడీఎస్ రీఫండ్ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగుతోంది'' అని మిథాలి మధుస్మిత తెలిపారు.










