Aug 12,2023 07:23

స్వయం సేవకుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌, దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరుచుకున్నది. దళితుల్ని హిందువులుగాను, ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు 'ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం' ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో, హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది. ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది.

          'సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌' (అందరినీ కలుపుకొని అందరి అభివృద్ధి) అని భారతీయ జనతా పార్టీ నినాదమిస్తుంది కానీ సమాజంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నది. మెజార్టీ మతవాద రాజకీయాలకు ముస్లింలు ప్రధాన లక్ష్యంగా ఉండగా, దళితులను అణచివేయడం కూడా అంతే సమానమైన ప్రధాన అంశం. ఓవైపు దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు దిగజారుతుండడం, మరోవైపు దళితులకు బిజెపి, ఎన్నికలపరంగా దగ్గరవుతున్న విడ్డూర పరిస్థితులు పెరుగుతుండడం చూస్తున్నాం. ఈ ఆధిపత్య రాజకీయాలకు మూలవిరాట్టుగా దళితుల్ని హిందూ జాతీయవాద స్రవంతిలోకి చేర్చుకోవాలని చెప్పే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రభావం కూడా పెరుగుతున్నది.
            పందొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో హిందూ మతంలో అణచివేతకు గురైన ప్రజల విద్య, ఇతర హక్కుల కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే 'దళితుడు' అనే పదాన్ని రూపొందించాడు. స్వామి వివేకానంద ''భారతదేశ భవిష్యత్తు'పై చేసిన ప్రసంగంలో ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ వర్గాల ప్రజలు చాలామంది కుల వ్యవస్థ అణచివేత కారణంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారని ఆయనన్నారు.
        సామాజిక సమానత్వం, ఆర్థిక న్యాయం,అందరికీ తాగునీటి బావుల అనుమతి, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం బి.ఆర్‌. అంబేద్కర్‌ చేపట్టిన అనేక అవిశ్రాంత పోరాటాల ద్వారా, ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ (1935) స్థాపన ద్వారా కొద్దిగా సానుకూల ఫలితాలు లభించాయి. విద్య, ఉద్యోగాలు, ఎన్నిక ల రంగంలో దళితులకు రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు కల్పించే నిర్ణయాత్మక చర్యల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దళితుల జీవితాల్లో దీనివల్ల కలిగిన ప్రభావం, కొద్ది మేరకు సంభవించిన మార్పులు నత్తనడకన సాగాయి.
         గడిచిన కొన్ని దశాబ్దాలలో దళితుల పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారాయి. వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ సూచికలు ఈ క్షీణించిన పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి. 'నేషనల్‌ కొయలేషన్‌ ఆఫ్‌ స్ట్రెందెనింగ్‌ ఎస్సీస్‌ అండ్‌ ఎస్టీస్‌' నివేదిక ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల వారిపై నేరాలు 2021లో 1.2 శాతం పెరిగాయి. అదే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీలపై అత్యాచారాలు అత్యధికంగా 25.8 శాతం నమోదు కాగా, రాజస్థాన్‌ 14.7 శాతం, మధ్యప్రదేశ్‌ 14.1 శాతంతో ఆ తరువాతి స్థానాల్ని ఆక్రమించాయి.
         బిజెపి హిందూత్వ ఎజెండాతో సమాజాన్ని రెండుగా విభజించడానికి, అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్ని పక్క దోవపట్టించేందుకు అస్థిత్వ సమస్యల్ని లేవనెత్తుతున్నది. గోరక్షక దళాలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని, మూకదాడులతో మనుషుల ప్రాణాలు తీయడం నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రచారాలతో రెచ్చిపోయిన మూకల ఆగ్రహానికి ప్రధానంగా బలవుతున్నది ముస్లిములైనప్పటికీ దళితులు సైతం పెద్ద సంఖ్యలో హత్యగావించబడుతున్నారు. ఉనా లో జరిగిన భయానక ఘటన వాస్తవంగా ఏం జరుగుతున్నదో మనకు తెలియచేస్తున్నది.
            చారిత్రక తప్పిదాలను సరిదిద్దడానికి దళితులకు రిజర్వేషన్ల కల్పన ఒక సాధనంగా వున్నమాట నిజమే కానీ, బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి ఇది కూడా దెబ్బతింటున్నది. ఆర్థిక ప్రాతిపదికపై రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం ద్వారా వాటి లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నది. కేవలం 5 శాతం శ్రామిక దళిత జనాభా మాత్రమే రిజర్వేషన్ల నుండి ప్రయోజనం పొందుతున్నారని సామాజిక శాస్త్రవేత్త, సుఖ్‌దేవ్‌ థోరట్‌ అభిప్రాయపడ్డాడు. అస్పష్టమైన ఆర్థిక ప్రాతిపదికతో దళితేతరులకు రిజర్వేషన్ల కల్పించడంకూడా వారి అవకాశాల అందుబాటును కుదించేస్తుంది. 'క్రీమీ లేయర్‌' (మెరుగైన దొంతర)ను ప్రవేశపెట్టడం, కుటుంబాలలో వ్యక్తుల ఆదాయాల్ని కలగాలపులగం చేయడం రిజర్వేషన్లకు ఒక వర్గాన్ని దూరం చేయడానికి దారి తీస్తుంది. 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి), అన్ని కళాశాలల్లో 700 ఖాళీలు ఉన్నాయని ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ సర్క్యులర్‌లో దళిత అభ్యర్థులకు కేవలం 2.5 శాతం పోస్టులు కేటాయించగా, ఎస్టీ అభ్యర్థులకు అసలు ఎలాంటి పోస్ట్‌లు రిజర్వ్‌ కాలేదు. ఇలాంటి చర్యలే ఈ వర్గాలను మరింత దుస్థితిలోకి నెడుతున్నాయి.
 

                                                                      ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక

భారతీయ జనతా పార్టీ ప్రతీ సందర్భంలోను దళితుల హక్కులు, నిబంధనలను నిర్వీర్యం చేసేందకు ప్రయత్నిస్తున్నదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది అర్థం కావాలంటే బిజెపి మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రను, అది ఏ పరిస్థితుల్లో స్థాపించబడిందో క్లుప్తంగా తెలుసుకోవాలి. వలస పాలనా కాలంలో భారతదేశంలో సామాజిక సంస్కరణల ప్రక్రియ పుంజుకోవడం, దళితుల్లో విద్యను ప్రోత్సహించడానికి జ్యోతిరావు ఫూలే చేసిన ప్రయత్నాలు, ఆ తరువాత సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్‌ చూపిన చొరవ దళితుల్లో మరింత సామాజిక అవగాహనకు, స్పృహకు దారితీసింది. ఈ అవగాహనే 1920లలో మహారాష్ట్ర లోని విదర్భలో ''బ్రాహ్మణేతర ఉద్యమానికి'' బాట వేసింది, ఈ విధమైన మార్పులను అగ్రకులాలకు చెందిన వారికి మింగుడుపడలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపనకు దారితీసిన కారణాలలో అదీ ఒకటి. హిందూ రాష్ట్ర ఎజెండా ఓవైపు ముస్లింలను, క్రైస్తవులను 'విదేశీయులుగా' పేర్కొంటూనే, మరోవైపున దళితులను బానిసలుగా పరిగణించిన మనుస్మృతి చట్టాల గురించి అదే పనిగా మాట్లాడ్డం మొదలుపెట్టింది. సమాజంలో సమానత్వం కోసం జరిగిన ప్రతి ఉద్యమాన్నీ అగ్రకులాలకు చెందిన వారు వ్యతిరేకించారు. భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌, దాని మద్దతుదార్లు రిజర్వేషన్ల నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించారు.
          రిజర్వేషన్ల అమలు చేయడం, ప్రభుత్వ రంగంలో విస్త్రతంగా ఉద్యోగాలు కల్పించడం వల్ల దళితులు సామాజిక రంగంలోకి రావడం మొదలైంది. 1980లో దళిత సమాజం, సమానత్వం వైపు సాగించిన యాత్రను వ్యతిరేకించడంతో పాటు అహ్మదాబాద్‌లో దళిత వ్యతిరేక హింస కూడా చోటుచేసుకుంది. 1990లో మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయడంతో రథయాత్రకు భారీ ఊపు లభించి, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. వీటన్నిటి ద్వారా బిజెపికి పెద్దఎత్తున ఎన్నికల్లో పైచేయి సాధించడానికి మార్గం తెరుచుకుంది.
           అదే సమయంలో బిజెపి ఆధిపత్య రాజకీయాలు, ఓవైపు దళిత సమాజాన్ని తొక్కిపడుతూనే వారిని సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థాయిలో ఆకర్షించేందుకు పనిచేశాయి. దళితులలో పని చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ 'సామాజిక సామరస్య వేదిక'ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కుల వ్యవస్థను దెబ్బ తినకుండా ఆ పరిధిలోనే ''హిందూ ఐక్యత'' కాపాడుకోవాలనే సందేశాన్నిచ్చింది. అంబేద్కర్‌ ''కుల నిర్మూలనకు'' విరుద్ధంగా ఈ సంస్థ భిన్న కులాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి దళితుల్లో పని చేసింది. సోషల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా దళిత సమాజంలో కొంత భాగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తిప్పుకోగలిగింది. దళితుల్ని మంచి చేసుకోవడానికి యు.పిలో సుహేల్‌దేవ్‌ లాంటి ముఖ్యమైన దళిత వ్యక్తులను తీసుకొచ్చి, ముస్లిం వ్యతిరేకతను కూడా ఎక్కించడం మొదలు పెట్టింది. ఇది ఒక దెబ్బకు రెండు పిట్టలు వ్యవహారమే. దళితులను ప్రసన్నం చేసుకునేందుకు వారి ఇళ్ళలో బిజెపి భోజనాల తంతుతో, వారిలో ఒక వర్గాన్ని ఆకట్టుకుంది. ''సంస్కృతీకరణ'' అనబడే ఈ తతంగం బాగా ప్రచారమైంది.
              స్వయం సేవకుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌, దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరుచుకున్నది. దళితుల్ని హిందువులుగాను, ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు 'ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం' ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో, హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది. ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది. ఇలాంటి వ్యూహాలతో బిజెపి 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లోని మొత్తం 84 సీట్లకు గాను 44 సీట్లను గెలుచుకుంది.
 

                                                                         దళిత ముస్లిం సమస్య

ఇస్లాం మతాన్ని స్వీకరించిన దళితులకు, రిజర్వేషన్లు కల్పించాలా, వద్దా అన్న మరో చర్చ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ''దళిత ముస్లింలు'' రెండు రకాల ఆగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. ముస్లింలుగా వారు మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారు. దళితులుగా రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. 'ఇస్లాంలో కుల వ్యవస్థ ఉండదు, అందరూ సమానమే అని విశ్వసిస్తారు కాబట్టి వారికి రిజర్వేషన్లను ఎందుకు కల్పించాల'ని అనేకమంది దళిత రచయితలు, మేథావులు వాదిస్తున్నారు. ఖురాన్‌లో కుల వ్యవస్థను అనుమతించలేదని కూడా వారు అంటున్నారు. ప్రముఖ దళిత మేథావులైన దిలీప్‌ మండల్‌, సూరజ్‌ యెంగ్డేలు ముస్లిం దళితులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. ఇస్లాం పవిత్ర గ్రంథాల ప్రకారం, ఇస్లాంలో కుల వ్యవస్థ లేదు కాబట్టి రిజర్వేషన్ల వర్తింపులో దళిత ముస్లింలను పరిగణలోకి తీసుకోకూడదని వారు వాదిస్తున్నారు. మత గ్రంథాలు చదవడం ద్వారా సమాజాలు నడవవు. సమాజంలోని ఉన్నత వర్గాలు అనేక కారణాలతో అణగారిన వర్గాల స్థితిని నిర్ధారిస్తాయి. ఆ వాస్తవం గుర్తించలేకపోవడమే వారి వాదనలో ఉన్న లోపం.
              దక్షిణాసియా సమాజాలలో కులం అనేది అన్నిటినీ మించిన వాస్తవం. దీనికి ముస్లింలు కూడా మినహాయింపు కాదు. ముస్లింలకు ఆధునిక విద్యనందించే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు ప్రారంభించినపుడు కూడా, అందులోని నిమ్న కులాల వృత్తికి ఎలాంటి ఆధునిక విద్య అవసరం లేదనే వాదన వచ్చింది. ఆ వాదనతోనే ఆధునిక విద్యను అందించడంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు.
        కనుక మిగిలిన దళితులెంత దళితులో...ముస్లిం దళితులు కూడా అంతే. నిర్ణయాత్మకమైన కనీస సానుకూల చర్యల నుండి దళిత ముస్లింలను దూరం చేయడమంటే జనాభాలో ఒక పెద్ద వర్గానికి అన్యాయం చేసినట్టే. అసలు సమస్య ఏమంటే, కేకును ఎక్కువ మంది అడిగినప్పుడు, దాన్ని మరింత పెద్దదిగా చేయాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ, ఎస్సీ రిజర్వేషన్లను గణనీయంగా తగ్గిస్తున్నది, కాబట్టి సమస్య ఇక్కడే ఉంది. ముస్లింల ఎన్నికల రిజర్వేషన్లు సంబంధించినంతవరకు, ఎన్నికల రంగంలో ముస్లింల ప్రాతినిధ్యం ఇప్పటికే చాలా తక్కువ స్థాయికి, అంటే జనాభాలో వారి ప్రాతినిధ్యం కంటే చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లపై ప్రభావం చూపుతాయని, వారి ఎన్నికల నిబంధనల అవసరాల్ని కూడా పెంచుతాయని కొందరు మేథావులు వాదిస్తున్నారు. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు విస్తరించే సందర్భంలో ఎన్నికలకు సంబంధించిన ఈ వాదనను పరిగణలోకి తీసుకోకూడదు.

(వ్యాసకర్త ఐఐటి మాజీ ప్రొఫెసర్‌, సామాజిక కార్యకర్త)
('ద వైర్‌' సౌజన్యంతో)
రామ్‌ పునియానీ

రామ్‌ పునియానీ