Sep 23,2023 21:27
  • నేడు ఆస్ట్రేలియాతో రెండో వన్డే
  • మ. 1.30గం||ల నుంచి

ఇండోర్‌: తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారతజట్టు ఇక సిరీస్‌పై గురిపెట్టింది. ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే రెండో వన్డేలోనూ నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగే చివరి సన్నాహక సిరీస్‌ ఇదే కావడం, పటిష్ట ఆస్ట్రేలియా సిరీస్‌ నెగ్గిన ఉత్సాహంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. తొలి వన్డేలో నెగ్గిన భారత్‌ ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌్‌లోనూ అగ్రస్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా జట్టులో మిఛెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తొలి రెండు వన్డేలకు దూరమయ్యారు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగే మూడో వన్డేకు వీరిద్దరూ అందుబాటులోకి రానున్నారు. దక్షిణాఫ్రికా టూర్‌లో వరుసగా మూడు వన్డేల్లో ఓడిన ఆసీస్‌.. భారత్‌తో తొలి వన్డేలోనూ ఓటమితో వరుసగా నాలుగు వన్డేల్లో ఓడినట్లైంది. గత ఆరేళ్లలో ఆసీస్‌ ఇలా ఓడిన సందర్భాలు లేనే లేవు. అలాగే ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగిన 320కంటే తక్కువ పరుగులు చేయడం ఇటీవలికాలంలో ఇదే ప్రథమం.

టీమిండియా : కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.