
అనకాపల్లి : ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలకు పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ... ఈనెల 7 న అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా లో అభిజిత్, లలిత, మైతాన్, సుందరం కార్మికులు పాల్గని జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. శనివారం సెజ్లో ఉన్న పరిశ్రమల వద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము మాట్లాడుతూ ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్తు సంస్కరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలకు గతంలో యూనిట్ కు నాలుగు రూపాయల 95 పైసలు నుండి 8 రూపాయల 85 పైసలకు పెంచిందన్నారు. దీనివలన పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ఇలాంటి విధానాలకు స్వస్తి చెప్పి పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలని, ఉన్న పరిశ్రమలను కాపాడి నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని సిఐటియూ డిమాండ్ చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, చినబాబు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.