న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ హెలికాప్టర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. రాజకీయ పార్టీలు, నేతలకు మాత్రం హెలికాప్టర్లు అందడం లేదు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ హెలికాప్టర్ చార్జీలు పెరుగుతున్నాయి. సాధారణంగా కొన్ని నెలల క్రితం గంటకు..లక్షన్నర రూపాయలకు అందుబాటులో ఉండే హెలికాప్టర్ ఇప్పుడు గంటకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకు పెరిగింది. దేశంలో మొత్తం 350 నుంచి 400 హెలికాప్టర్లు ఉన్నాయని హెలికాప్టర్ ఆపరేటింగ్ కంపెనీలు తెలిపాయి. వీటిలో దాదాపు 25 నుంచి 28 హెలికాప్టర్లు కేదార్నాథ్ యాత్రలో నిమగమై ఉన్నాయి.
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో హెలికాప్టర్లకు డిమాండ్ పెరుగుతోందని ఎస్ఆర్ఎస్ చోకర్స్ హబ్ ప్రయివేట్ లిమిటెడ్, మహాకాల్ ఏవియేషన్ డైరెక్టర్ సందీప్ శర్మ తెలిపారు. ప్రస్తుతానికి హెలికాప్టర్లను ప్రముఖ పార్టీలు, వారి నాయకులు కొందరు బుక్ చేసుకున్నారు. సెప్టెంబర్ తర్వాత రాజస్థాన్లో చార్టర్డ్ హెలికాప్టర్ విమానాల రాకపోకలు పెరిగాయి. జులైలో చార్టర్డ్ విమానాలు 398. ఆగస్టులో 445కి పెరిగింది. సెప్టెంబర్లో 945 విమానాల రాకపోకలు నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో దాదాపు 1500 నుంచి 2000 చార్టర్డ్ హెలికాప్టర్ విమానాలు అవసరమవుతాయని అంచనా.
ఎన్నికల కోసం కేదార్నాథ్ హెలికాప్టర్లు
ప్రస్తుతం కేదార్నాథ్లో 25 నుంచి 28 హెలికాప్టర్లు మోహరించి ఉన్నాయి. దీపావళి తర్వాత రక్షాబంధన్ వరకు అక్కడ ఉన్న హెలికాప్టర్లు బిజీగా ఉంటాయి. అనంతరం హెలికాప్టర్లకు సాంకేతిక పరమైన పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ. తరువాత విమానయాన శాఖ అధికారులు హెలికాప్టర్లను తనిఖీ చేస్తారు. సర్టిఫై చేసిన హెలికాప్టర్లు టేకాఫ్కు సంబంధించిన సరైన నివేదిక వచ్చాకే.. ఎన్నికల కార్యక్రమాల్లో వినియోగించనున్నారు.










