Oct 04,2023 12:15
ODI World Cup

'' ప్రపంచకప్‌ 2023 టికెట్ల కోసం నన్ను అడగొద్దు.. మీ ఇండ్లలోనే మ్యాచ్‌ను చూసి ఎంజాయ్ చేయండి.. ప్లీజ్‌ '' అని టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ పోస్ట్‌ చేశారు. 2011లో భారత్‌ వన్డే ప్రపంచకప్‌కి ఆతిథ్యమిచ్చింది. అప్పుడు ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో టీమిండియా కప్‌ కైవసం చేసుకుంది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌కి భారత్‌ ఆతిథ్యం ఇస్తుంది. భారత్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. సొంత గడ్డపై కప్‌ అందుకోవాలని ఎదురుచూస్తోంది. ఇక అక్టోబర్‌ 5వ తేదీ నుంచి నవంబర్‌ 19 వరకు ప్రపంచకప్‌ వార్‌ జరగనుంది. అక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్‌ మెగా టోర్నీ వేటను ప్రారంభించనుంది. అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది.

                                                  రేపటి నుండి మెగా టోర్నీ మ్యాచ్‌లు...

ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో ఇంగ్లండ్‌, న్యూజీలాండ్‌ మధ్య జరగనుంది. గురువారం (అక్టోబర్‌ 5) నుంచి మెగా టోర్నీ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. దీంతో క్రికెట్‌ ప్రపంచమంతా ప్రపంచకప్‌ మ్యాచ్‌ కోసం ఉర్రూతలూగుతోంది. ఇక... మెగా టోర్నీ టికెట్స్‌కు ఉండే డిమాండే వేరు.. క్రికెట్‌ అభిమానులంతా ఆ టిక్కెట్ల కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇదే సమయంలో మరోవైపు ... ఆటగాళ్లకు కూడా వారి బంధువులు, స్నేహితుల నుండి టిక్కెట్ల కోసం ఒత్తిడులు మొదలవుతాయి. ఈ బాధ నుంచి బయటపడేందుకు విరాట్‌ కోహ్లీ ముందుగానే పోస్ట్‌ ద్వారా తన సన్నిహితులందరికీ రిక్వస్ట్‌ చేశారు.

                                                                  విరాట్‌ కోహ్లీ ట్వీట్‌ ...

'' వన్డే ప్రపంచకప్‌కి సమయం ఆసన్నమైంది. టోర్నీ ముగిసే వరకు టికెట్ల కోసం నన్ను అభ్యర్థించవద్దని నా స్నేహితులందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఇంట్లో నుంచే మ్యాచ్‌లను ఎంజాయ్ చేయండి '' అని విరాట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారు. ఓ ఫన్నీ ఏమోజీని కూడా జత చేశారు.

;