
వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలలో జలబు, దగ్గు ముఖ్యమైనవి. వీటితో పాటు గొంతు నొప్పి కూడా చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటమే గొంతు నొప్పికి కారణం. చాలా మందికి ఉదయం లేచే సరికి గొంతు పట్టేస్తూ ఉంటుంది. మరికొంతమందికి గొంతునొప్పి రోజులు తరబడి వేధిస్తూ ఉంటుంది. కొన్ని రకాల కషాయాలను తాగడం ద్వారా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు.
అల్లం కషాయం : దీనిని తయారు చేయడానికి ముందుగా వేడి నీటిలో అల్లం వేసి ఉడికించాలి. తరువాత ఆ నీటిని ఓ గుడ్డలో వేసి వడకట్టాలి. తరువాత ఆ నీటిలో కొంచెం తేనే వేసుకొని తాగాలి. అల్లంలో ఇన్ఫెక్షన్లను పోగొట్టే లక్షణాలు ఉంటాయి. అందుకే దీనిని తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. లేదా అల్లం టీ లాంటివి తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.
తులసి, మిరియాల కషాయం : కొన్ని తులసి ఆకులు, మిరియాలు కలిపి నీటిలో ఉడికించాలి. తరువాత వాటిని వడకట్టి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది.
మిరియాలు, బాదం కషాయం : నల్ల మిరియాలను, బాదం పప్పులను కలిపి పొడి చేసుకోవాలి. దాన్లో కొంచెం నెయ్యి కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది. నల్ల మిరియాల పొడిని నీటిలో వేసుకొని తాగినా తొందరగా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గోరు వెచ్చని నీరు : గొంతునొప్పి వచ్చినప్పుడు గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలి. కూల్ డ్రింక్స్, చల్లని పానీయాలు, చల్లని నీటిని తాగడం ఆపేయాలి. వీలైనంత వరకు వేడిగా ఉండే పదార్థాలనే తీసుకోవాలి.