Oct 03,2023 07:08

ప్రస్తుతం మన దేశంలో భూ వినియోగం విషయంలో ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అవసరాల కోసం, గోల్ఫ్‌ కోర్సుల కోసం చాలా ఎక్కువమంది పేదలు నివసిస్తున్న భూములను ఖాళీ చేయిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో ఉండేవారికోసం అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు.

మోడీ ప్రభుత్వం మార్కెట్‌ అవసరాలకు (కార్పొరేట్ల అవసరాలకు) అనుగుణంగా భూ వినియోగాన్ని మార్చే పనిలో ఉంది. పెట్టుబడి ఆదిమ సంచయంతో ఇటువంటి మార్పులే జరుగుతాయి. భూమితో సహా అన్ని సంపదలూ సమిష్టిగా అనుభవిస్తున్నవిగాని, చిన్న చిన్న యజమానులు అనుభవిస్తున్నవి గాని కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో చిక్కడమే కాకుండా, ఆ సంపదల వినియోగం తీరు కూడా మారిపోతుంది. చిన్న చిన్న రైతుల చేతుల్లో ఉండే భూమి కాస్తా కొద్దిమంది కార్పొరేట్ల పాలైతే అప్పుడు అక్కడ చిన్న తరహా ఉత్పత్తి విధానం పోయి, భారీ స్థాయి సరుకుల ఉత్పత్తి మొదలౌతుంది.

         ఈ మోడీ ప్రభుత్వం నిరంతరం కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చడం కోసం పనిచేస్తూ వుంటుంది. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో, ఇతర రంగాలలో ఉన్న కార్పొరేట్లు ప్రాజెక్టులు చేపట్టి లాభాలను పిండుకోవడం కోసం దేశంలోని విస్తారమైన అటవీ ప్రాంతాలను నాశనం చేయడానికి అనుమతిస్తోంది. అందుకోసం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తెస్తోంది. తద్వారా ప్రభుత్వ సంరక్షణలో ఉండే కొన్ని అటవీ ప్రాంతాలను ఇకముందు అడవులుగా పరిగణించకుండా అటవీ సంరక్షణ చట్టం పరిధిలోంచి తొలగించనుంది.
         1996లో సుప్రీం కోర్టు ఒక తీర్పు వెలువరించింది. దాని ప్రకారం అటవీ ప్రాంతంగా ఉన్న భూమిని, అది ఎవరి స్వాధీనంలో ఉన్నప్పటికీ, దానిని ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదు చేయకపోయినప్పటికీ, ప్రభుత్వం సంరక్షించాల్సిందే. ప్రభుత్వ రికార్డులు అటవీ ప్రాంతాలను నమోదు చేయడంలో ఘోరంగా వెనుకబడ్డాయి. అడవి అనే నిర్వచనమే చాలా అస్పష్టంగా ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. అందువలన సుప్రీం కోర్టు ప్రతీ రాష్ట్రంలోనూ ఒక నిపుణుల కమిటీని నియమించాలని, రికార్డుల్లో లేని అన్ని అటవీ ప్రాంతాలనూ గుర్తించాలని, వాటన్నింటికీ అధికారికంగా అటవీ ప్రాంతాలుగా గుర్తింపునివ్వాలని, అప్పుడే వాటిని చట్ట ప్రకారం సంరక్షించడం సాధ్యపడుతుందని ఆ తీర్పులో ఆదేశించింది.
ఈ తీర్పు వచ్చిన 18 సంవత్సరాల తర్వాత కూడా, అంటే 2014 నాటికి కూడా హర్యానా, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అటవీ ప్రాంతాలను గుర్తించడానికి కాని, వాటిని ప్రభుత్వ రికార్డులలో తగు విధంగా నమోదు చేయడానికి గాని ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. ఈ సంగతి ఒక పాత్రికేయుల బృందం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ లొసుగుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఏకంగా చట్టానికే సవరణలు తెచ్చి రికార్డులకెక్కని అటవీ భూములకు ప్రభుత్వ సంరక్షణ లేకుండా చేస్తోంది.
ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. నిజానికి కేంద్రం ఇంతవరకూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసిన రాష్ట్రాలను హెచ్చరించి ఆ తీర్పు అమలు జరిగేలా చూసి వుండాలి. లేదా కేంద్ర ప్రభుత్వమే ఒక నిపుణుల కమిటీని నియమించి అన్ని రాష్ట్రాలలోనూ నమోదు కావలసిన అటవీ ప్రాంతాలను గుర్తించి అవి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలని ఆ యా రాష్ట్రాలను ఆదేశించి వుండాల్సింది. అలా చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వాన్ని సాకుగా తీసుకుని సుప్రీం కోర్టు తీర్పునే రద్దు చేసేలా చట్ట సవరణకు సిద్ధం కావడం మోడీ ప్రభుత్వ తెంపరితనానికి నిదర్శనం.
          సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా తమ నిర్వహణలో ఉన్న తోటలను కూడా అడవులుగా గుర్తించే అవకాశం ఉందని ప్రైవేటు యజమానులు భయపడుతున్నారని, తమ భూములను తమకు నచ్చిన విధంగా వినియోగించుకునే హక్కు కోల్పోతామని వారు భావిస్తున్నారని, అందువలన ప్రైవేటు తోటల విస్తరణ ఆగిపోయిందని, దాని ఫలితంగా పచ్చదనం దెబ్బ తింటోందని, ప్రైవేటు యజమానుల భయాలను పోగొట్టి పచ్చదనాన్ని విస్తరించడానికే ఈ సవరణ తీసుకువస్తున్నామని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తమ చర్యను సమర్ధించుకున్నారు.
           ఇది అందరినీ తప్పుదోవ పట్టించే వాదన. మొదటి విషయం: అడవుల, తోటల విస్తీర్ణం పెరగకపోడానికి ఒక కారణాన్ని అది ముందుకు తెచ్చింది. తోటలు పెంచుతున్న, పెంచాలని అనుకుంటున్న ప్రైవేటు యజమానుల మనసుల్లో భయాలు ఏర్పడ్డాయన్నదే ఆ కారణం. అటువంటిది వాస్తవంగా ఉందో, లేదో, ఉంటే ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఉందో చెప్పగల గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. దానిమీద ఎటువంటి స్వతంత్ర అధ్యయనమూ లేదు, ఆధారాలూ లేవు. రెండవ విషయం: ఒకవేళ ప్రైవేటు యజమానులకు ఆ విధమైన భయాలు నిజంగా ఉన్నా, అడవులకు, తోటలకు మధ్య తేడాను స్పష్టంగా తెలియజెప్పే విధంగా నిర్వచించడమే దానికి పరిష్కారం ఔతుంది. అలా చేయడం పోయి ఏకంగా చట్టాన్నే మార్చేయవలసిన అగత్యం ఏముంది? ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అడవీ ప్రాంతాలను సంరక్షించడం కాదు దాని లక్ష్యం. విస్తారమైన అటవీ ప్రాంతాలను వ్యాపారానికి అనువుగా మార్చివేయడమే.
              అలా గనుక జరిగితే పర్యావరణానికి కలిగే నష్టం అపారంగా ఉంటుంది. ఇప్పటిదాకా, దేశంలో అటవీ భూముల విస్తీర్ణం వాస్తవంగా ఎంత ఉందో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. అందులో ఎంతమేరకు ఇప్పుడు వ్యాపారానికి అనువుగా మార్చబోతున్నారో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. ఐతే ఈ రంగంలోని నిపుణులు మాత్రం గణనీయమైన అటవీ ప్రాంతాన్ని కోల్పోనున్నామని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు హర్యానా రాష్ట్ర పరిధిలోకి వచ్చే ఆరావళీ పర్వత శ్రేణికి చెందిన అటవీ ప్రాంతం అధికారికంగా అడవిగా నమోదు కాలేదు. ఆ ప్రాంతం దేశ రాజధానికి దగ్గర్లో ఉంది. అందుచేత ఆ ప్రాంతంమీద చాలామంది రియల్టర్ల కన్ను పడింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వ్యాపారాలకు వినియోగించడం జరిగితే దేశ రాజధాని ప్రాంతంలో అత్యంత ఆవశ్యమైన పచ్చదనం కాస్తా కనుమరుగౌతుంది.
              పర్యావరణానికి కలిగే అపార నష్టంతోబాటు ఆ అడవుల మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజల గతి ఏమౌతుంది? అడవుల్లో చిన్న తరహా అటవీ ఉత్పత్తులను సేకరించి తమ జీవనాన్ని వెళ్ళదీస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఆ అడవులు ధ్వంసం అయితే వారి జీవనోపాధి ఏమౌతుంది? వారికి ప్రభుత్వం ఏ ప్రత్యామ్నాయాన్నీ చూపించకుండా అడవులను ధ్వంసం చేయడానికి అనుమతిస్తే అది వారందరి జీవితాలనూ నాశనం చేయడమే ఔతుంది. ఉమ్మడి సంపదను కొందరు కొల్లగొట్టి పోగేసుకునే ''ఆదిమ సంచయం'' ఫలితంగా అనేకుల జీవితాలు విధ్వంసం అవుతాయని మార్క్స్‌ చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. పలు దళిత, గిరిజన సంఘాలు మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణను బలంగా వ్యతిరేకించడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.
          అటవీ భూములను ప్రైవేటీకరించే ఈ ప్రయత్నం ఒక పెద్ద సవాలును ముందుకు తెచ్చింది. అది కేవలం అడవీ భూములకు సంబంధించినదే కాదు, మొత్తం భూమికి సంబంధించినది. మన దేశంలో భూమి కొరత చాలా ఉంది. అంతే కాదు, ఆ కొరతను భర్తీ చేయడం కూడా అసాధ్యం. అటువంటప్పుడు ఆ పరిమితమైన భూమిని ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేది ఉపాధి, ఆహార భద్రత, తదితర సామాజిక లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. ఆ లక్ష్యాలను సాధించడంలో భూమి వినియోగం కీలకం ఔతుంది. అందుచే త అటువంటి కీలకమైన భూమి వినియోగాన్ని ప్రైవేటు వ్యక్తుల ఇష్టాలకు వదిలిపెట్టకూడదు. భూమిని మొత్తంగా సమాజపరం చేయలేకపోవచ్చు. కాని భూ వినియోగాన్ని మాత్రం సామాజికంగా నియంత్రించాల్సిందే. వరిసాగులో ఉన్న భూములను ఇతరత్రా వినియోగించడాన్ని నియంత్రిస్తూ కేరళ రాష్ట్రంలో చేసిన చట్టం వెనుక ఉన్న తర్కం ఇదే.
          దీనర్ధం ఏమిటి? ఒకరివద్ద నుండి మరొకరు కొంత భూమిని కొంటున్నప్పుడు ఆ లావాదేవీని అనుమతించాలంటే ఒక షరతు విధించాలి. ఆ భూమి చేతులు మారాక దాని వినియోగం మారితే (పంట పొలంగా ఉన్నది కాస్తా ఇళ్ళ నిర్మాణానికో, ఫ్యాక్టరీ కట్టడానికో ఉపయోగిస్తే) అలా మారిన వినియోగం సమాజానికి ఆమోదయోగ్యంగా ఉండాలి అన్నదే ఆ షరతు. ఈ సూత్రాన్ని అనుసరించే 1996లో సుప్రీం కోర్టు అటవీ భూములను వేరే విధంగా వినియోగించడాన్ని నిరోధిస్తూ తీర్పు చెప్పింది. పర్యావరణ రక్షణ దృష్ట్యా, స్వేచ్ఛా మార్కెట్‌ (కార్పొరేట్లను) కార్యకలాపాలను నియంత్రించడం అవసరమేనని అందరూ ఒప్పుకుంటారు. కాని మొత్తం సమాజం ప్రయోజనాలను కాపాడాలంటే ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలను నియంత్రించాల్సిందే అన్న సాధారణ సూత్రంలో ఇదొక అంతర్భాగమేనని అందరూ గమనించాలి.
       ప్రస్తుతం మన దేశంలో భూ వినియోగం విషయంలో ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అవసరాల కోసం, గోల్ఫ్‌ కోర్సుల కోసం చాలా ఎక్కువమంది పేదలు నివసిస్తున్న భూములను ఖాళీ చేయిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో ఉండేవారికోసం అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు.
            ఇప్పుడు దేశంలో భూ వినియోగాన్ని సామాజిక ప్రయోజనాల దృష్ట్యా నియంత్రించడానికి ఏ విధమైన పద్ధతులను ప్రవేశ పెట్టాలన్న ప్రశ్న మనల్ని వెనక్కి లాగేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి మార్కెట్‌లో అమ్మకానికి వచ్చే ఏ భూమినైనా మొదట ఆ కార్పొరేషన్‌కే అమ్మజూపాలి అన్న నిబంధన విధించాలి. అప్పుడు ఆ కార్పొరేషన్‌ ఆ భూమిని కొని దానిని తిరిగి మరొకరికి అమ్మేటప్పుడు ఆ కొనుగోలుదారులు దాన్ని సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వినియోగించే షరతును అమలు చేయగలుగుతుంది. లేదా, నేరుగానే ఇద్దరు వ్యక్తుల మధ్య భూ లావాదేవీ జరిగినప్పుడు దానిని కొనేవారు సామాజికంగా ఆమోదయోగ్యమైన రీతిలోనే వినియోగించాలన్న షరతును విధించవచ్చు. ఆ షరతును ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించవచ్చు.
           ఐతే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇందుకు పూర్తి వ్యతిరేక దిశలో అడుగులు వేస్తోంది. మార్కెట్‌ అవసరాలకు (కార్పొరేట్ల అవసరాలకు) అనుగుణంగా భూ వినియోగాన్ని మార్చే పనిలో ఉంది. పెట్టుబడి ఆదిమ సంచయంతో ఇటువంటి మార్పులే జరుగుతాయి. భూమితో సహా అన్ని సంపదలూ సమిష్టిగా అనుభవిస్తున్నవిగాని, చిన్న చిన్న యజమానులు అనుభ విస్తున్నవి గాని కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో చిక్కడమే కాకుండా, ఆ సంపదల వినియోగం తీరు కూడా మారి పోతుంది. చిన్న చిన్న రైతుల చేతుల్లో ఉండే భూమి కాస్తా కొద్దిమంది కార్పొరేట్ల పాలైతే అప్పుడు అక్కడ చిన్న తరహా ఉత్పత్తి విధానం పోయి, భారీ స్థాయి సరుకుల ఉత్పత్తి మొదలౌతుంది.
         నల్ల వ్యవసాయ చట్టాలు ఈ లక్ష్యం కోసమే రూపొందాయి. తమ తమ స్వంత వినియోగం కోసం గాని, ఎఫ్‌సిఐ ద్వారా దేశ ఆహార అవసరాలను తీర్చడం కోసం గాని ప్రధానంగా పంటలు పండించే చిన్న రైెతుల నుండి భూమి కార్పొరేట్ల పరం చేసి సంపన్న పెట్టుబడిదారీ దేశాల అవసరాలను తీర్చే వాణిజ్య పంటలు పండించడానికి ఆ చట్టాలు తోడ్పడతాయి. ఇప్పుడు అటవీ సంరక్షణ చట్టానికి చేస్తున్న సవరణ కూడా అటవీ భూముల వినియోగాన్ని మార్చి స్వదేశీ, విదేశీ సంపన్నుల అవసరాల కోసం మళ్ళించడానికే ఉపయోగపడుతుంది. ఆ అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులను అడివికి దూరం చేస్తుంది.

(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌