
న్యూఢిల్లీ : ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులు ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యానికి పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదిక ప్రచురించింది. ఉరిశిక్ష విధించిన భారతీయులు ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యానికి పాల్పడ్డారని ఖతార్ అధికారులు వెల్లడించినట్లు రైటర్స్ తన నివేదికలో తెలిపింది. అయితే దీనిని ఇటు భారత్ అధికారులు గానీ, అటు ఖతర్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. భారత నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్ కోర్టు గురువారం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. వీరంతా కొన్ని నెలల నుంచి ఖతార్ అధికారుల నిర్బంధంలో ఉన్నారు. గూఢచార్యం ఆరోపణల పై వీరికి కోర్టు మరణ శిక్ష పడడంపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై న్యాయ పోరా టం సాగిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.