Nov 05,2023 22:06

గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌కు చేరువగా..
చెన్నై : భారత యువ చెస్‌ స్టార్స్‌ ఆర్‌. ప్రజ్ఞానంద, ఆర్‌. వైశాలి అరుదైన రికార్డు సాధించారు. ప్రతిష్టాత్మక చెస్‌ క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించిన తొలి అక్కా తమ్ముడిగా నిలిచారు. ఫిడె మహిళల గ్రాండ్‌ స్విస్‌ టోర్నీలో మాజీ వరల్డ్‌ చాంపియన్‌ చైనా గ్రాండ్‌మాస్టర్‌పై గెలుపొందిన వైశాలి.. వచ్చే ఏడాది కెనడాలో జరుగనున్న క్యాండిడేట్స్‌ టోర్నీకి బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఈ టోర్నీలో మరో రౌండ్‌ మిగిలి ఉండగా.. అగ్రస్థానంలో నిలిచి కనీసం టాప్‌ా2 ముగింపు లాంఛనం చేసుకుంది. ఇక ప్రస్తుతం 2498 క్లాసికల్‌ రేటింగ్‌తో ఉన్న వైశాలి గ్రాండ్‌మాస్టర్‌ హోదాకు మరో రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి తర్వాత భారత్‌ నుంచి గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకోనున్న మూడో మహిళగా వైశాలి నిలువనుంది. ఈ ఏడాది చెస్‌ ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద ఇదివరకే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించిన సంగతి తెలిసిందే.