
హింస మొదలైనప్పుడు, అధికారులు తగిన రీతిలో స్పందించకపోవడం వల్లే పరిస్థితులు ఇంత దూరం వచ్చాయనే అభిప్రాయాన్ని స్థానికులు వెలిబుచ్చారు. హింసను నివారించడంలో అధికారుల వైఫల్యం గురించి మాట్లాడుతూ, మహిళా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను చుట్టుముట్టిన మూకల నుండి ఆమెను రక్షించడంలో తాను సహకరించానని సీనియర్ న్యాయవాది రంజన్ చౌదరి అన్నారు. ఆమెను బయటకు తీసుకురావడానికి, రక్షణగా ఉండటానికి పోలీసులు నిరాకరించారు. ప్రచారంలో ఉన్న వీడియోలను పరిశీలించి, వాటిలో బహిరంగ బెదిరింపులకు దిగిన వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ నుహ్ అడిషనల్ ఎస్పీ ఉషా కుందూకు చేసిన అభ్యర్థనలను వారు పట్టించుకోలేదని చౌదరి అన్నారు.
హర్యానా లోని నుహ్ కు, ఢిల్లీ నుండి గంట ప్రయాణం. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న నుహ్ జిల్లాలో, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత ఎక్కువ. ఈ ప్రాంతానికి మత ఉద్రిక్తతల చరిత్ర ఉంది. జులై 31న కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ధ్వంసమైన వాహనాలు, దగ్ధమైన దుకాణాలు భయోత్పాతాన్ని గుర్తుచేస్తాయి.
ఇద్దరు హోమ్ గార్డులు, నలుగురు పౌరులు మొత్తం ఆరుగురు ఈ ఘర్షణల్లో చనిపోయారు. ఘర్షణల వార్తలు పల్వాల్, సోహ్నాతో పాటుగా నుహ్ కు పొరుగున వున్న గురుగ్రామ్, ఇతర ప్రాంతాల్లోనూ విన్పించాయి. గురుగ్రామ్ నడిబొడ్డున ఒక మసీదును దగ్ధం చేశారు. సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో జరిగే జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని దేశ రాజధాని ప్రాంతంలో, నుహ్ లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున ముస్లిం యువకుల్ని కట్టడి చేస్తూ చర్యలు చేపట్టి, మైనర్లను కూడా నిర్బంధించసాగారని స్థానిక ముస్లింలు ఆరోపించారు. ఆగస్టు 3వ తేదీ వరకు హింసకు సంబంధం ఉందన్న పేరుతో 176 మందిని అరెస్ట్ చేసి, 90 మందిని నిర్బంధించి, 93 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నిర్వహించిన బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర, శివాలయం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేద్లా మోడ్ దగ్గరకు చేరినపుడు ఒక మతానికి చెందిన యువకులు ఆ యాత్ర పైన రాళ్ళు రువ్వడంతో సమస్య మొదలైంది. వాడి వేడి మాటలతో మొదలైన ఘర్షణ రాళ్ళ వర్షంగా మారిందని స్థానికులు అంటున్నారు. సామాజిక మాధ్యమంలో వచ్చిన వీడియోల్లో ఇరువర్గాల వారు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు, తుపాకుల్లాంటి మారణాయుధాలతో కనిపించారు. యాత్రలో భాగస్వాములైన వందలాది మంది శివాలయంలో తలదాచుకున్నారు, తరువాత పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే సామాజిక మాధ్యమాల్లో, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న నుహ్ లాంటి ప్రాంతాల్లో హిందువులకు రక్షణ లేదని, హిందూత్వ సంస్థల సభ్యులు కథనాలను వ్యాప్తి చెయ్యనారంభించారు.
పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ, ఆ రాత్రి గురుగ్రామ్ సెక్టార్57 లోని అంజుమన్ జమా మసీద్కు డిప్యూటీ ఇమామ్గా ఉన్న హఫీజ్ సాద్, మూక దాడిలో చనిపోయాడు. బీహార్ లోని సితా మర్హీకి చెందిన అతడు సంవత్సరం క్రితమే అక్కడికి వచ్చాడు. స్థానికుల కథనం ప్రకారం, అర్థరాత్రి సమయంలో సాయుధ మూక మసీదుపై దాడి చేసి, నిప్పంటించింది. సాద్ సుమారు రాత్రి 2 గంటల సమయంలో చనిపోయాడని అతని సోదరుడు షాదాబ్ చెప్తున్నాడు. రాత్రి 11.30 గంటలకు సాద్ తన అక్కకు ఫోన్ చేస్తే, ఆమె బీహార్ తిరిగి వచ్చేయమని చెప్పగా, మసీదుకు రక్షణగా చుట్టూ పోలీసులు ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. దాడిలో ఛాతీపై అనేక కత్తిపోట్లు పొడవడంతో చనిపోయాడని షాదాబ్ చెప్పాడు. మసీదులో ఉన్న మరో వ్యక్తిని కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అతనింకా ఐసియూ లోనే ఉన్నాడు. నేరస్తులను గుర్తించే పనిలో ఉన్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులంటున్నారు.
ఈ హింసకు ప్రధాన ఉత్ప్రేరకంగా రెండు వీడియోలు పని చేసినట్లు కనిపిస్తోంది. ఒకటి, ఇద్దరు ముస్లింలను చంపిన నేరంలో ప్రధాన నిందితుడు, పరారీలో వున్న గోరక్షక దళ సభ్యుడైన మోనూ మనేసార్ వాట్సప్ ద్వారా పంపిన వీడియో. మరొకటి ఫరీదాబాద్ గోరక్షక బజరంగ్ ఫోర్స్ యూనిట్ ఇన్చార్జ్ బిట్టూ బజరంగీ జులై 31 ఉదయం 11 గంటలకు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన లైవ్ వీడియో. విహెచ్పి యాత్రలో మోనూ మనేసార్ పాల్గొంటున్న ఉద్దేశ్యాన్ని బిట్టూ ఆ వీడియోలో చెప్పాడు. ''నేను మీకు (ముస్లింలకు) ముందుగానే చెప్తున్నాను. మీ బావ గారు (మోనూ మనేసార్) ఇక్కడ సందర్శనకు వస్తున్నాడు. మేం మళ్ళీ మీకు చెప్పలేదని అనొద్దు. ఆయన కోసం పూలు, పూలదండలతో సిద్ధంగా ఉండండి'' అని బిట్టూ బజరంగీ ఆ వీడియో ద్వారా చెప్పాడు.
మోనూ మనేసార్ హర్యానాలో స్వయం ప్రకటిత గోరక్షకుడు. ఆవుల్ని దొంగ రవాణా చేస్తున్నారన్న అనుమానంతో ఫిబ్రవరి 16వ తేదీన బజరంగ్దళ్ సభ్యులు నాసిర్, జునైద్లను కిడ్నాప్ చేసి, హత్య చేసిన నేరాల్లో మోనూ ప్రధాన నిందితుడు. కారు లోకి ఎక్కించి, సజీవ దహనం చేయడానికి ముందు వారిని అనాగరికంగా కొట్టారు. వారిరువురూ రాజస్థాన్ లోని గోపాల్గఢ్ గ్రామానికి చెందిన వారు. నాసిర్, జునైద్లను హత్య చేసినందుకు మోనూపై మే నెలలో రాజస్థాన్ పోలీసులు కేసు మోపారు. కానీ, అతన్ని పట్టుకోలేక పోయారు. రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించిన మేవత్లో ఈ కేసు ఒక సున్నితమైన సమస్యగా మిగిలింది. నుహ్ ను సందర్శించాలన్న మోనూ నిర్ణయంతో ఆగ్రహించిన కొందరు ముస్లిం యువకులను (బిట్టూ సవాల్కు ప్రతిస్పందనగా) ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉండేట్లు ఉసిగొల్పారు.
''సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసినపుడు, ఆ ప్రాంత ప్రజల మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. జునైద్, నాసిర్ల హత్య కేసులో మోనూ నిందితుడు. ప్రజలు భావోద్వేగాలకు లోనయ్యారు. అయితే అక్కడ ఏమీ జరగనట్టు, మోనూ, నుహ్ సందర్శిస్తానని చెప్పాడు'' అని ఉలామా-ఈ-హింద్ సభ్యుడు ముఫ్తీ సలీం చెప్పాడు. ఆగస్ట్ 1వ తేదీన విహెచ్పి, బజరంగ్దళ్, జమైత్ ఉలామా-ఈ-హింద్ ప్రతినిధులు పాల్గొన్న శాంతి సమావేశానికి ఇతను కూడా హాజరయ్యాడు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగడంతో శాంతి సమావేశం వల్ల ఫలితం లేకుండా పోయింది.
ముస్లిం యువకులను కోపోద్రిక్తులను చేసి, వారు ప్రతిస్పందించేలా చేయాలనే ఉద్దేశం లేనట్లయితే నాసిర్, జునైద్ల హత్యా నేరంలో నిందితుడైన మోనూను ఇక్కడికెందుకు ఆహ్వానించాలని-గాంధీగ్రామ్ నివాసి, నుహ్ లో టీ కొట్టు నిర్వాహకుడు అయిన మహమ్మద్ అయూబ్ అంటున్నాడు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఘర్షణలు సృష్టించాలనే ఉద్దేశ్యం విహెచ్పికి ఉందని అదే ప్రాంత నివాసి మౌజ్ఖాన్ అభిప్రాయపడుతున్నాడు. బిజెపి హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోయే లక్ష్యంతోనే ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘర్షణల్ని సృష్టించి, హిందువులు ప్రమాదంలో ఉన్నారనే కథనాలను వ్యాపింప చేస్తున్నారని ఆయన అన్నాడు.
వచ్చే సంవత్సరం జరగబోయే సాధారణ ఎన్నికలు, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో హిందువుల మద్దతు పొందే లక్ష్యంతోనే మేవాత్ ప్రాంతంలో మత ఉద్రిక్తతలు సృష్టించే ప్రణాళికను బిజెపి రచించిందని-శాంతి సమావేశ భాగస్వామి, స్వరాజ్ ఇండియా పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ అంటున్నారు. వీడియోల ద్వారా హింసను ప్రేరేపించిన బజరంగ్దళ్ సభ్యులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
హింస మొదలైనప్పుడు, అధికారులు తగిన రీతిలో స్పందించకపోవడం వల్లే పరిస్థితులు ఇంత దూరం వచ్చాయనే అభిప్రాయాన్ని స్థానికులు వెలిబుచ్చారు. హింసను నివారించడంలో అధికారుల వైఫల్యం గురించి మాట్లాడుతూ, మహిళా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను చుట్టుముట్టిన మూకల నుండి ఆమెను రక్షించడంలో తాను సహకరించానని సీనియర్ న్యాయవాది రంజన్ చౌదరి అన్నారు. ఆమెను బయటకు తీసుకురావడానికి, రక్షణగా ఉండటానికి పోలీసులు నిరాకరించారు. ప్రచారంలో ఉన్న వీడియోలను పరిశీలించి, వాటిలో బహిరంగ బెదిరింపులకు దిగిన వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ నుహ్ అడిషనల్ ఎస్పీ ఉషా కుందూకు చేసిన అభ్యర్థనలను వారు పట్టించుకోలేదని చౌదరి అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు ఇంకా చక్కర్లు కొడుతున్నాయి కాబట్టి అధికార యంత్రాంగానికి చర్యలు తీసుకునే ఉద్దేశం లేదనేది స్పష్టం అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు గురిచేస్తున్న పోస్టులను తీసివేయలేదు, ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలోకి తీసుకోలేదని విమర్శకులు అంటున్నారు. హింస చెలరేగిన తరువాత మాత్రమే ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసి, దానిని ఆగస్టు 5 వరకు పొడిగించింది. ఈ క్రమంలో, పరిస్థితిని చక్కదిద్దడంలో అధికారుల తీరుపై బిజెపి పాలకపక్ష సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గురుగ్రామ్ ఎంపీ, కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, నుహ్ హింసపై మాట్లాడుతూ.... యాత్రలో పాల్గొన్నవారు కత్తులు, కర్రలు చేబూనడం సరైంది కాదన్నారు. వారికి ఆయుధాలెవరిచ్చారు? కత్తులు, కర్రలు పట్టుకుని ప్రదర్శనకు ఎవరు వెళ్తారు? అంతమాత్రాన అవతలివైపు నుండి ప్రేరేపిత చర్యల్లేవనడం లేదని ఆయన చెప్తున్నాడు. యాత్రకు అనుమతిచ్చే సందర్భంలో, యాత్రలో ఖచ్చితంగా ఆయుధాలు లేకుండా చూడాలని నిర్వాహకులకు చెప్పినట్లు నుహ్ డిప్యూటీ కమిషనర్, ప్రశాంత్ పన్వర్ మీడియాతో అన్నారు. 2016, ఫిబ్రవరిలో 10 రోజులపాటు రాష్ట్రాన్ని కలవరపరచిన హింసాత్మక జాట్ నిరసనల సందర్భంలో కూడా మనోహర్లాల్ ఖట్టర్ నాయకత్వం లోని ప్రభుత్వం మొద్దు నిద్ర పోయింది. అప్పుడు చెలరేగిన హింసను అదుపు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు న్నాయి. ఈసారి హర్యానాలో చెలరేగిన హింస, పేద ముస్లింలు నివసించే ప్రాంతాలకు విస్తరించింది. వారు అధికారుల ఒత్తిడిని కూడా ఎదుర్కొనాల్సి వస్తోంది. ఆగస్టు 4న, అధికారులు నుహ్ లో ముస్లిం వలస కార్మికులకు చెందిన 250 గుడిసెలు, పాకలను కూల్చివేశారు. అయితే, ఇవి ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలని అధికారులు ఆరోపిస్తున్నారు. హింస వెనుకున్న కుట్రను బట్టబయలు చేసి, నేరస్తులను శిక్షిస్తామని ముఖ్యమంత్రి ఖట్టార్ అంటున్నారు. ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని ప్రకటించారు. మానేసార్ను పట్టుకునేందుకు వేట మొదలైందన్నారు.
ఈ క్రమంలో ఆగస్ట్ 2వ తేదీన నుహ్, గురుగ్రామ్లో అల్లర్లు జరిగిన తర్వాత విహెచ్పి, బజరంగ్దళ్ తలపెట్టిన ప్రదర్శనలను నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ దరఖాస్తు దాఖలైంది. ప్రదర్శనల్లో ఎలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా కేంద్రం హామీ ఇవ్వాలని, ప్రదర్శనలు నిర్వహించే సందర్భంలో భద్రతా కారణాల రీత్యా అదనపు బలగాలను మోహరింప చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
('ఫ్రంట్లైన్' సౌజన్యంతో)
ఇస్మత్ ఆరా