ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వైసిపి నాయకుల తీరు సరికాదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వినుకొండలో అక్రమ కేసులకు వ్యతిరేకంగా శాంతియుత వాతావరణంలో నిరసన తెలియజేస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలపై వీధి రౌడీల్లా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రెచ్చగొట్టే తీరుతో శాంతి భద్రతల సమస్య వస్తుంటే, నివారించాల్సిన పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైసిపి నేతల రౌడీయిజంపై పోలీసులు కఠినంగా వ్వవహరించాలని డిమాండ్ చేశారు. వినుకొండలో ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రంలో శాంతి భద్రతల తీరుకు నిదర్శనమన్నారు.










