Oct 14,2023 10:49
  • తొలి జాబితాలో ఆమెకు, ఆమె మద్దతుదారులకు దక్కని చోటు

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం 41 మంది అభ్యర్థులతో బిజెపి విడుదల చేసిన మొదటి జాబితాను విడుదల చేసింది.అయితే మాజీ సీఎం వసుంధరా రాజేను పక్కన బెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఏ నాయకుడి ముఖాన్ని ప్రదర్శించకుండా రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని నడ్డా-షా సమావేశంలో ప్రకటించినపుడే వసుంధరా సీటుపైనే అనుమానాలు తలెత్తాయి.
          ఈ జాబితాలో ప్రకటించిన 41 మంది అభ్యర్థుల్లో 31 మంది కొత్త ముఖాలు. మహారాణి దియా కుమారి, రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ పేర్లతో సహా ఏడుగురు ఎంపీలకు కూడా పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. అదే సమయంలో టికెట్‌ ఆశించిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మద్దతుదారులు చాలా మంది నిరాశకు గురయ్యారు. దీనిపై రాజస్థాన్‌ రాజకీయాల్లో కలకలం రేగింది. టికెట్‌ రద్దుపై ఆగ్రహంతో అరడజను మందికి పైగా నాయకులు లేదా వారి మద్దతుదారులు బహిరంగ నిరసనకు దిగారు. జైపూర్‌లోని జోత్వారా స్థానం నుంచి రాజ్‌పాల్‌ సింగ్‌ షెకావత్‌ను కాదని కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌కు టికెట్‌ ఇచ్చింది. రాథోడ్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని జోత్వారా బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు.
          సంచోర్‌ స్థానం నుంచి ఎంపీ దేవ్‌జీ పటేల్‌కు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. సంచోర్‌లో కూడా దేవ్‌జీని వ్యతిరేకిస్తున్నారు. నివేదికల ప్రకారం, దేవ్‌జీ పటేల్‌ కాన్వారులో ఉన్న వాహనాలపై రాళ్లు రువ్వడం , ధ్వంసం చేసిన సంఘటన కూడా జరిగింది. ఈ ఘటన వెనుక తన ప్రత్యర్థుల కుట్ర ఉంటుందన్న భయాన్ని దేవ్‌జీ వ్యక్తం చేశారు.
         టికెట్లు రాని అనితా సింగ్‌, రాజ్‌పాల్‌ సింగ్‌ షెకావత్‌లు కూడా మాజీ సీఎం వసుంధరను కలిశారు. వసుంధరతో పలువురు నేతలు కూడా భేటీ అయినట్టు చర్చ జరుగుతోంది. రాజస్థాన్‌లో టిక్కెట్ల పంపిణీ వసుంధర రాజేకి నిజంగా ఎదురుదెబ్బ కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా చేస్తామని బిజెపి ఇప్పటికే ప్రకటించినందున ఈ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 1998 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి ఈ విధంగా చేయడం ఇదే మొదటిసారి.
         మరోవైపు తనకు, తన మద్దతుదారుల టిక్కెట్లు కోతపడడంతో వసుంధర ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే వసుంధర ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు, అసహనం వ్యక్తం చేయలేదు. తొలి జాబితాలో చోటు దక్కని నేతలను వసుంధర రాజే సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రాజస్థాన్‌లో రాజకీయాలు వేడెక్కాయి.