- ఫైబర్నెట్ కేసులో విచారణ వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:స్కిల్ డెవలప్మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది. శుక్రవారం తీర్పు ఇవ్వనుంది. అలాగే ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు ముగిశాయి. ఎపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. 'ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ చట్టం కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే' అని రోహత్గీ వాదించారు. 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు. చంద్రబాబు తరపున మరో న్యాయవాది సిద్దార్థ లూథ్రా జోక్యం చేసుకుని మధ్యంతర బెయిల్ కోరారు. దీనికి జస్టిస్ అనిరుద్ధబోస్ జోక్యం చేసుకుని తాము ప్రధాన విషయం విన్నామని, తీర్పునే వెలువరిస్తామని అన్నారు. మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు.
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. కోర్టు విచారణ జరిగేవరకు అరెస్టు చేయొద్దన్న అభ్యర్థనను పొడిగించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోరారు. దీంతో అప్పటి వరకు అరెస్టు చేయొద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీంకోర్టు సూచించింది.










