- మంత్రి రజనికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వినతి
ప్రజాశక్తి- పిచ్చాటూరు (తిరుపతి) : సత్యవేడు నియోజకవర్గానికి స్పెషలిస్ట్ వైద్యులను నియమించాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజనిని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. గురువారం ఉదయం తిరుపతి విచ్చేసిన మంత్రిని ఎమ్మెల్యే కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గైనకాలజిస్ట్, రేడియోగ్రాఫర్ తప్పనిసరిగా నియమించాలని కోరారు. గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల పేద ప్రజలు ప్రసవ సమయాల్లో 100 కిలోమీటర్లు పైగా ఉన్న తిరుపతి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. దీనివల్ల కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన వివరించారు. అలాగే రేడియోగ్రాఫర్ నిపుణుల కొరతతో పాటు నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో వైద్యులు, సిబ్బంది కొరత వంటి సమస్యలను ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.










