కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో ఆదివారం భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత భూకంపలేఖినిపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్లోని హెరాత్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం సంభవించిన భూకంపంలో నష్టాల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ నెల 7వ తేదీన హెరాత్ ప్రావిన్స్లో వచ్చిన భూకంపంలో ఇప్పటి వరకూ 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ నెల 11వ తేదీన మరోసారి 6.3 తీవ్రతతో ఇక్కడ భూకంపం వచ్చింది. ఈ రెండో భూకంపంలో వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్థాన్లో సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.