Oct 09,2023 10:19
  • దిగుమతి సుంకం రద్దుతో ధరల తిరోగమనం
  • కేంద్రం తీరుతో సాగుదారులకు నష్టం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లాలో లాభాల పంటలా కీర్తి గడించిన ఆయిల్‌ పామ్‌ సాగు నష్టాల బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌పై దిగుమతి సుంకం రద్దు చేయడంతో గతేడాదిగా పరిస్థితి తలకిందులైంది. దేశీయ మార్కెట్లో ధరలు పడిపోవడం పరిపాటిగా మారింది. వంట నూనెలు ఉత్పత్తి చేసే సంస్థలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఆయిల్‌పామ్‌ ధరలు నేలను తాకుతున్నాయి. గతేడాది మేలో టన్ను గెలలకు గరిష్టంగా రూ.23,365 ధర ఉండగా, ప్రస్తుతం ఇది రూ.12,900కు పడిపోయింది. ఇదే ధర కొనసాగితే ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు నష్టపోతామని సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 19 మండలాల్లో 40,826 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. అత్యధికంగా నల్లజర్లలో 10,490 ఎకరాల్లో సాగులో ఉంది. జిల్లాలో ఈ ఏడాది మరో ఐదు వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులు లక్ష్యంగా తీసుకున్నారు. ఈ లక్ష్యంలో 4,175 ఎకరాల్లో మొక్కలు నాటడం ప్రారంభమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ దశలో ధరలు తిరోగమనంలో ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టన్నుకు కనీసం రూ.20 వేలు ఇప్పించాలని కోరుతున్నారు.
 

                                                                           గతంలో లాభాల పంట

జిల్లాలో పండిన ఆయిల్‌పామ్‌ గెలలను గానుగ ఆడించి, ముడి చమురును పెద్దాపురం, నల్లజర్లలోని యర్నగూడెంలలో మిల్లులకు తరలిస్తుంటారు. ఆయా మిల్లుల్లో ప్రతి నెలా సగటు ముడి చమురు నిష్పత్తి (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో-ఒఇఆర్‌) ఆధారంగా అధికారులు, వ్యాపారుల కమిటీ ఆయిల్‌పామ్‌ గెలలకు ధర నిర్ణయిస్తుంది. గతేడాది ఫిబ్రవరి మూడో వారంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆయా దేశాల నుంచి క్రూడ్‌ పామాయిల్‌ (సిపిఒ) దిగుమతి నిలిచిపోయింది. దీంతో, దేశీయంగా వంట నూనెలను ఉత్పత్తి చేసే కంపెనీలకు ముడిసరకు కొరత ఏర్పడింది. దీంతో, రైతుల నుంచి ఆయిల్‌పామ్‌ గెలలను ఆయా కంపెనీలు పోటీపడి కొనుగోలు చేశాయి. గతేడాది మార్చిలో టన్నుకు రూ.21,940, ఏప్రిల్‌లో రూ.22,518, మేలో రూ.23,365 చొప్పున చెల్లించాయి. గడిచిన 16 నెలల్లో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఈ ఏడాది ప్రారంభంలో టన్నుకు రూ.13,600 చొప్పున కంపెనీలు ధర చెల్లించాయి. ప్రస్తుతం మరో రూ.700 ధర పడిపోయింది. దీంతో, తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
 

                                                              కేంద్ర ప్రభుత్వ విధానాలతో తిరోగమనం

కేంద్ర ప్రభుత్వ విధానాలతో ధరలు ఒక్కసారిగా నేలను తాకాయి. 2020 సెప్టెంబరులో టన్ను ధర రూ.10,112 ఉంది. ఆ తర్వాత నుంచి క్రమేపీ ధరలు పెరిగాయి. 2021 జనవరిలో రూ.15,500కు జూన్‌లో రూ.16,828 చొప్పున కంపెనీలు కొనుగోలు చేశాయి. 2022 జనవరిలో రూ.17,000, ఫిబ్రవరిలో రూ.19,300, మార్చిలో రూ.21,940 ఏప్రిల్‌లో రూ.22,518, మేలో రూ.23,365 చొప్పున ధర చెల్లించాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో దిగుమతులు మందగించాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతిపై సుంకాన్ని గతేడాది ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీలు, ఆయిల్‌పామ్‌ గెలల కొనుగోలు ధరలను భారీగా తగ్గించాయి. అప్పటి నుంచి ప్రతి నెలా తగ్గించుకుంటూ వస్తున్నాయి. దిగుమతి సుంకం తగ్గడంతో ఆయిల్‌ కంపెనీలు దేశీయ మార్కెట్లో కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.
 

                                                                            పరిస్థితి తలకిందులైంది

ఆయిల్‌పామ్‌ సాగు గతేడాది వరకూ ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. ఎరువుల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఎకరాకు రూ.75,000 వరకూ పెట్టుబడి అయింది. దిగుబడులు, గిట్టుబాటు ధర రాకపోవడతో పెట్టుబడి కూడా రావడం లేదు.
                 - పాతూరి సత్యనారాయణ, పామాయిల్‌ రైతు,
                        అచ్చెన్నపాలెం, నల్లజర్ల మండలం