వాషింగ్టన్ : ఇజ్రాయిల్-హమాస్ భీకర పోరులో గాజాలో తీవ్ర మానవతా సంక్షోభం నెలకొన్న వేళ ... సామాన్య పౌరులు కనీస వసతులు కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాజాలో చిక్కుకున్న పాలస్తీనా ప్రజలకు సాయమందించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తోపాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సంప్రదింపులు జరిపారు.
నెతన్యాహుతో-పాలస్తీనా అధ్యక్షుడితో సంప్రదింపులు..
ప్రమాదంలో ఉన్న పౌరుల సంఖ్య, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే ప్రమాదంపై అంతర్జాతీయంగా ఆందోళన కొనసాగుతోంది. ఈ పోరులో చిక్కుకున్న సామాన్యుల పౌరులను మానవతా సంక్షోభం నుంచి రక్షించేందుకు కావాల్సిన చర్యలను చేపడుతున్నారు. సామాన్య పౌరులను రక్షించేందుకు కొనసాగే చర్యలకు తన పూర్తి మద్దతు ఉంటుందని బైడెన్ హామీ ఇచ్చారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత బైడెన్ ఇప్పటికే పలుసార్లు నెతన్యాహుతో మాట్లాడారు. కానీ, పాలస్తీనా అధ్యక్షుడితో చర్చించడం మాత్రం ఇదే తొలిసారి. గాజాలోని పాలస్తీనా ప్రజలకు సాయం అందించేందుకు చేపడుతున్న చర్యలను బైడెన్కు అబ్బాస్ ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం.
సంక్షోభ నివారణకు ముమ్మర ప్రయత్నాలు...
మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ సంక్షోభ నివారణకు పశ్చిమాసియా దేశాలతో దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ యుద్ధం మరింత విస్తరించకుండా నిలువరించేందుకు వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్తో పాటు యుఏఈ ప్రభుత్వ ప్రతినిధులతోనూ చర్చించారు. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్తో మాట్లాడారు. సామాన్యులను రక్షించాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. ఇదిలా ఉండగా .. అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా యూఎస్ఎస్ డ్వైట్ డి.ఐసన్హౌవర్ అనే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను పంపింది. ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలో ఇజ్రాయెల్ కు సపోర్ట్గా యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్ క్యారియర్ పనిచేస్తుంది.