Nov 03,2023 20:53

విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక విద్యుత్‌ డిఈ కార్యాలయంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశులు, రైతుసంఘం మండల అధ్యక్షులు శేఖర్‌ మాట్లాడారు. గత 15 రోజుల నుంచి అకస్మాత్తుగా 9 గంటల నుంచి 7 గంటలకు తగ్గించారని తెలిపారు. పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విద్యుత్‌ కోత వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులకు ఇది కోలుకోలేని దెబ్బ అని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే 9 గంటల విద్యుత్‌ ఇచ్చి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు. లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎఇ చెన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. రైతుసంఘం మండల సభ్యులు హనుమంతు రెడ్డి పాల్గొన్నారు.