
ప్రజాశక్తి-మధురవాడ : అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఎఐయు) ఆధ్వర్యాన గీతం విశ్వవిద్యాలయంలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల టార్గెట్ బాల్ పోటీలు (పురుషుల విభాగం) నిర్వహించనున్నట్లు గీతం క్రీడా విభాగం డైరక్టర్ అరుణ్కార్తీక్ తెలిపారు. గీతంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పోటీల్లో దేశంలోని 29 విశ్వవిద్యాలయాల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గీతం, ఆంధ్ర, నాగార్జున, కెఎల్యు విశ్వవిద్యాలయాలతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ జట్లు పాల్గొంటాయని తెలిపారు. విలేకర్ల సమావేశంలో గీతం క్రీడా విభాగం డిప్యూటీ డైరక్టర్ శ్రీనివాస్, మేనేజర్ రితేష్ సిన తదితరులు పాల్గొన్నారు.