ప్రజాశక్తి -పార్వతీపురంటౌన్ : మున్సిపల్ ఆప్కాస్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరుతూ ఈనెల 7న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్.శంకర్రావు, ఎన్వై నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద, ప్రజారోగ్య విభాగం రెండవ కార్యాలయం ఆవరణలో కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 7న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రికల్, వాటర్ సెక్షన్, ఇంజనీరింగ్ విభాగం తదితర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సింహాచలం, మల్లేష్, శ్రామిక మహిళ నాయకులు ఎన్.నిర్మల తదితరులు పాల్గొన్నారు.










