
ఛాతి కొలతలు తీస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి - గుంటూరు సిటి : పోలీసు నియామక పక్రియలో భాగంగా గుంటూరు రేంజ్ పరిధికి సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గుంటూరు పెరేడ్ గ్రౌండ్స్లో దేహదారుఢ్య పరీక్షలు బుధవారం కొనసాగాయి. పరీక్షలను గుంటూరు రేంజ్ ఐ.జి పాల్రాజుతో పాటు నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డి, అడిషనల్ ఎస్పీ సుప్రజా పరివేక్షిచారు. బుధవారం 755 మంది అభ్యర్థులకు గాను 449 మంది అర్హత సాధించినట్లు ఐ.జి తెలిపారు. వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టుల అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లతో పాటు 1600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. డీఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్రావు పాల్గొన్నారు.