ప్రజాశక్తి - సీతానగరం : మిషన్ ఇంద్ర ధనుష్, డీ వార్నింగ్ కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు విజయవంతం చేయాలని సీతానగరం, పెదంకలం వైద్యులు శిరీష, రాధాకాంత్ తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బలగ రమణమ్మ, జెడ్పీటీసీ బాబ్జీతో పాటు మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచుల చేతుల మీదుగా ఆయా కార్యక్రమాలకు సంబందించి పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. మిషన్ ఇంద్ర ధనుష్ ద్వారా పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల పిల్లల వరకు షెడ్యూల్ ప్రకారం వ్యాధినిరోధక టీకాలు వేయాలని, ఏమైనా కారణాల వల్ల ఆ సమయానికి పిల్లలకు టీకా వేయకపోతే వారిని గుర్తించి, వారికి ఈనెల 7నుంచి 12 వరకు వేయడమే లక్ష్యమని వైద్యులు తెలిపారు. ఈనెల 10న డి-వార్మింగ్ డే కార్యక్రమం ద్వారా నులిపురుగులు నివారణకు మందులు వేస్తామన్నారు. అందరు దీనిపై దృష్టిపెట్టి సహకారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిడిఓ ప్రసాద్, ఇఒపిఆర్డి వర్మ మండల అధికారులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు. అనంతరం రెండో పూట ఎంపిడిఒ కార్యాలయంలో మండలంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని వైద్యులు శిరీష, రాధాకాంత్లు నిర్వహించి డీ వార్మింగ్ కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. పిల్లలకు నులిపురుగులు మందులు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ప్రసాద్, ఎంఇఒ సూరిదేముడు, వెంకటరమణ, హెచ్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










