ప్రజాశక్తి- పిఎం పాలెం : జివిఎంసి ఆరో వార్డులోని 36 సచివాలయం పరిధి దేవిమెట్టలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, సచివాలయ సిబ్బంది శనివారం పర్యటించారు. అక్కడ ప్రయివేట్ లే-అవుట్లో కాలువలు ఇబ్బందికరంగా మారాయని స్థానికులు జోనల్ కమిషనర్కు వివరించారు. తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులను జోనల్ కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, వైసిపి భీమిలి నియోజకవర్గ ఎస్సీ సెల్ ఇన్ఛార్జి కనకరాజు సియ్యాద్రి, గుంటుబోయిన సంజీవ్, తాతారావు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ సిబ్బంది రాకున్నా హాజరే...
జివిఎంసి ఆరో వార్డు పరిధి రిక్షా కాలనీలో ఉన్న 39వ సచివాలయాన్ని శనివారం జోనల్ కమిషనర్ రాము ఆకస్మిక తనిఖీ చేశారు. 9 మందికి కేవలం ఒక్కరే హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా ఆదివారం కూడా విధులకు హజరైనట్లు ఉండటం చూసి ఖంగుతిన్నారు.. యూనీఫాం వేసుకోకుండా వచ్చిన వెల్ఫేర్ సెక్రెటరీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విఆర్ఒ మూడు రోజులుగా రాకపోయినా సరే హాజరు నమోదు కావడం పట్ల అడ్మిన్పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హులైన ఆరుగురికి ఇళ్ల పట్టాలు రాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.










