6న చలో విజయవాడను జయప్రదం
చేయండి
- తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్
జిల్లా అధ్యక్షులు బివి రమణయ్య
ప్రజాశక్తి - గూడూరు టౌన్ : ఆటో, మోటార్, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్సుపోర్టు వర్కర్స్ ఫెడరేషన్ ( ఏఐఆర్టిడబ్ల్యుఎఫ్) ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ ఆరవ తేదీ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6వ తేదీ నిర్వహించనున్న చలో విజయవాడను జయప్రదం చేయాలని తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బివి రమణయ్య పిలుపు నిచ్చారు. గూడూరు పట్టణంలోని సిఐటియూ కార్యాలయంలో మంగళవారం మార్కెట్ సెంటర్ ఆటో కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఆ సంఘం పట్టణ అధ్యక్షులు పి. లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బి.వి.రమణయ్య మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్, ధరలు, పెనాల్టీలు వెంటనే తగ్గించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక రవాణ రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు సాధనకు జీవో నెంబర్ 21ను వెంటనే రద్దు చేయాలని, వాహనాలు నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ప్యాసింజరు ట్రక్కులు ఇతర వాహనాలకు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని, గ్రీన్ టాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఆ సంఘం పట్టణ అధ్యక్షులుగా వి.కోటయ్య, ఉపాధ్యక్షులుగా కె.సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా బి రమేష్, సహాయ కార్యదర్శిగా బిపెంచలయ్య, ట్రెజరర్గా బి వెంకటేష్, కమిటీ సభ్యులుగా సిహెచ్సురేంద్ర, ఎస్కె రఫీ, పి మహేష్, యం కోటేశ్వరరావు, కె దినేష్, అర్ సురేంద్రను ఎన్నుకున్నారు.










