Aug 01,2021 07:08

న్యూఢిల్లీ : దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 10 రాష్ట్రాల్లో తీవ్రత అధికంగా ఉందని, ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్యతో పాటు పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వీటితోపాటు కోవిడ్‌ టెస్టులు, వ్యాక్సిన్‌ పంపిణీ పెంచాలని అన్ని రాష్ట్రాలకూ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతోన్న కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిషా, అసోం, మిజోరాం, మేఘాలయ, మణిపూర్‌ రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉందని, 53 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్యలో ఉందని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితులు మరింత క్షీణించే ప్రమాదముందని హెచ్చరించారు. 60 ఏళ్ల వయసుపైబడిన వారితో పాటు 45-60 ఏళ్ల వారికి కోవిడ్‌ మరణం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తోన్న నేప థ్యంలో వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని తెలిపింది.