ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఈనెల 4, 5న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. గురువారం ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గతనెల 27న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి, అందులో ఏమైనా తప్పులు, పొరపాట్లు జరిగి ఉంటే సంబంధిత ఎఇఆర్ఒ, ఇఆర్ఒ, బిఎల్ఒ లేదా జిల్లా ఎన్నికల అధికారికి సంబంధిత ఫారంలో డిసెంబర్ 9లోపు అందజేయాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని తెలిపారు. చనిపోయినా లేదా శాశ్వతంగా వేరే ప్రదేశానికి మారినా, వారి ఓట్లు తొలగించడానికి ప్రత్యేక ఫారాలను విడివిడిగా ఇవ్వాలని చెప్పారు. పై సవరణలన్నీ పూర్తయిన తర్వాత ఎలాంటి తప్పులకూ ఆస్కారం లేకుండా వచ్చే జనవరి 5న ఓటర్ల జాబితా ప్రచురిస్తున్నట్లు తెలిపారు. బెల్ కంపెనీ నుంచి 16 మంది ఇంజినీర్లు అక్టోబర్ 16 నుంచి ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేస్తున్నారని, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయిన తర్వాత నమూనా పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇన్ఛార్జీ డిఆర్ఒ మల్లికార్జునుడు, రాజకీయ పార్టీ ప్రతినిధులు వైసిపి నుంచి స్టేట్ లీగల్ జనరల్ సెక్రటరీ పుల్లారెడ్డి, కాంగ్రెస్ నుంచి బిటి.స్వామి, టిడిపి నుంచి ఎల్వి.ప్రసాద్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సృజన