Jun 26,2023 21:20

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - హోళగుంద
ఈనెల 30న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతుసంఘం నాయకులు కోరారు. సోమవారం స్థానిక బస్టాండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్‌ మాట్లాడారు. రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం, పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న రైతులకు పరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు. 2022 ఖరీఫ్‌లో పంటలు దెబ్బతిన్న రైతులకు పంటల బీమా, నష్టపరిహారం విడుదల చేయాలని కోరారు. గతేడాది నవంబరు, డిశంబరు, ఈఏడాది ఏప్రిల్‌, మేలలో వచ్చిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నకిలీ విత్తనాలు, అకాల వర్షాలతో 2022 ఖరీఫ్‌లో పత్తి, మొక్కజొన్న, ఉల్లి, టమోటా వంటి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని చెప్పారు. వారికి ఇప్పటి వరకు పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటివి ఇవ్వలేదన్నారు. ఎరువుల ధరలు నియంత్రించాలని, రైతులు పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు, సీనియర్‌ నాయకులు కట్టప్ప, రాఘవేంద్ర, వెంకటేష్‌ పాల్గొన్నారు. పెద్దకడబూరు బస్టాండ్‌లో గోడ పత్రికలు ఆవిష్కరించారు. రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈడిగ తిక్కన్న గౌడ్‌, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్‌ పాల్గొన్నారు.