29న విజయవాడలో మహాధర్నా : కెవిపిఎస్
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించాలని, దళితులకు రక్షణ కల్పించాలని కోరుతూ సెప్టెంబర్29వ తేదీన విజయవాడలో చేపట్టే సామాజిక న్యాయంకై చేపట్టే మహాధర్నా పోస్టర్ ను శుక్రవారం యశోద నగర్ లోని ఎంబి భవన్ లో కెవిపిఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు పి. ముని రామయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దళితుల రక్షణ కోసం ఉన్న చట్టాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని అన్నారు. ఎస్టీ ,ఎస్టీ కార్పొరేషన్లను ఉత్తుత్తి కార్పోరేషన్లగా మార్చి ఉపాధి లేకుండా చేశారని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు లోపు ఇచ్చే ఉచిత విద్యుత్తు పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. సామాజిక న్యాయం కోసం ఈనెల 29వ తేదీ విజయవాడలో జరుగుతున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వందవాసి నాగరాజు, కెవిపిఎస్ నాయకులు ఎండి శ్రీనివాసులు, చైతన్య, సిఐటియు నాయకులు టి సుబ్రమణ్యం, కే వేణుగోపాల్, పి బుజ్జి, వి ఎస్ మన్యం, ఎస్ఎఫ్ఐ నాయకులు రవి, తిరుపతి స్థానిక హక్కుల పోరాట కమిటీ నాయకులు డీఎంసీ భాస్కర్, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణలో...










