Nov 21,2023 22:17

సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణదాస్‌

* వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌
ప్రజాశక్తి - రణస్థలం : 
సామాజిక సాధికార బస్సు యాత్రను ఈనెల 27న ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌తో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాత్రలో భాగంగా 27న రణస్థలం మండలం పైడిభీమవరంలోని మహి గ్రాండ్‌లో పలువురు మంత్రులు విలేకరుల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కొండములగాం మోడల్‌ స్కూల్‌ సందర్శన అనంతరం రణస్థలం నుంచి బైక్‌ ర్యాలీగా వెళ్లి లావేరు మండలం బుడుమూరు గ్రామ సచివాలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. అక్కడ్నుంచి ఎచ్చెర్ల మండలం చిలకపాలెం కూడలికి చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. అనంతరం పోస్టర్‌ను అవిష్కరించారు. సమావేశంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్‌, ఎచ్చెర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రతినిధి ఎల్‌.ప్రసాద్‌, ఎచ్చెర్ల ఎంపిపి మొదలవలస చిరంజీవి, జి.సిగడాం ఎంపిపి ప్రతినిధి మీసాల వెంకటరమణ, రణస్థలం, జి.సిగడాం జెడ్‌పిటిసిలు టి.సీతారాం, కె.రమణ తదితరులు పాల్గొన్నారు.