
ప్రజాశక్తి-నెల్లూరు : ఈ నెల 27 నుంచి డిశంబర్ 3 వరకు వారం రోజులపాటు జరిగే కులగణన సర్వేలో జిల్లాలోని 769 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్కరినీ నమోదు చేయాలని కులగణన జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ రోణంకి కుర్మనాధ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని జెడ్పి హాల్లో ఎపి రాష్ట్ర కులగణన - 2023ay భాగంగా ఎంపిడిఒలు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లకు జిల్లా స్థాయి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు శతాబ్ధ కాలం తర్వాత కులగణన జరుగుతుందని, ఎక్కడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో అందరూ సంపూర్ణ అవగాహన కల్గించుకుని, తదుపరి డివిజనల్, మండల స్థాయిలోని కింది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఈశిక్షణలో ట్రైనీ కలెక్టర్ సంజనా సింహ, ఆర్ డి ఓ లు మాలోల, శీనా నాయక్, జిల్లా బిసి సంక్షేమ అధికారి వెంకటయ్య, ఐ టి డి ఎ పీఓ మందా రాణి, ఎస్సి సంక్షేమ శాఖ డిడి రమేష్ ఉన్నారు.