ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: విదేశీ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, విదేశాలలో ఉన్నత విద్యకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో వివరించేందుకు గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన 'యుఎస్ఎ స్టడీ ఎక్స్పో-2023' నిర్వహించనున్నట్లు గ్లోబల్ ట్రీ ఏరియా మేనేజర్ వై.ప్రశాంత్ తెలిపారు. లబ్బీపేటలోని సంస్థ కార్యాలయంలో స్టడీ ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. ఈసందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ అమెరికాలో విద్యను అభ్యసించేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారన్నారు. నగరంలోని ఫార్చ్యున్ మురళీ హోటల్లో 21వ తేదీ ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్టడీ ఎక్స్పో ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ తరువాత మన రాష్ట్రం నుండి ఎక్కువ మంది ఇతర దేశాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారన్నారు. అయితే అమెరికాలో విద్యావిధానం ఉలా ఉంటుంది, అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు ఏయే విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయో తెలియచేసేందుకు అక్కడి వర్శిటీ ప్రతినిధులు వచ్చి వివరిస్తారన్నారు. అమెరికాకు చెందిన వంద విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొననున్నారని తెలిపారు. ఉన్నత విద్యా కోర్సులను వివరించడంతో పాటు స్కాలర్షిప్లు, హాస్టల్ వసతి సౌకర్యాలను కూడా వివరిస్తారన్నారు. అమెరికాలోని టాప్ వర్శిటీలైన సౌత్ ఫ్లోరిడా, డ్యూక్, వాషింగ్టన్ స్టేట్ వర్శిటీ, ప్యూర్డీ వర్శిటృ, కాన్కోర్డియా యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ మిసిసిపితో పాటు ప్రముఖ వంద వర్శిటీల ప్రతినిధులు రానున్నారని తెలిపారు. ఈస్టడీ ఎక్స్పోలో అమెరికా వర్శిటీలో స్పాట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. అలాగే స్టడీ ఎక్స్పోకు హాజరైన ప్రతిఒక్కరికీ ఉచితంగా 'ఐఇఎల్టిఎస్' కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9100121527 ఫోన్ నెంబర్కు సంప్రదించాలని తెలిపారు.










