
21న పులికాట్ పనులకు సిఎం శంకుస్థాపన
జగన్ పర్యటనపై పెద్దిరెడ్డి సమీక్ష
ప్రజాశక్తి - తడ
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూళ్లూరుపేటలో పర్యటించనున్నారు. పులికాట్ సరస్సు ముఖద్వారాలు పూడికతీసే పనులకు సిఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కాళంగి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
సిఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖా మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పి పరమేశ్వరరెడ్డి, ఎంఎల్ఎలు కిలివేటి సంజీవయ్య, ఆదిమూలం, ఎంపి గురుమూర్తి పాల్గొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్వజయంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. హెలిప్యాడ్ కొరకు అపాచీ సమీపంలోని స్థలాన్ని పరివీలించారు. స్థానిక టివిఆర్ఆర్ కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష జరిగింది.