ప్రజాశక్తి-కంచికచర్ల
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాసం పేరుతో 10 తరగతి మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం సోమేశ్వరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శనివారం ప్రజ్నా వికాసం మోడల్ పరీక్ష వాల్ పోస్టర్లు ను హెచ్ ఎం శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 20 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 3.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ మోడల్ పరీక్ష కు హాజరుకావచ్చన్నారు. మోడల్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 25 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పదవ తరగతి పరీక్షలు ఎలా ఉంటాయో ఇప్పటి నుంచే ఆలోచించి గందరగోళం పడే విద్యార్థుల్లో మనోధైర్యం కల్పించేందుకు ఈ మోడల్ పరీక్ష దోహదపడుతుందన్నారు. ప్రముఖ విద్యావేత్త, పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, పర్యవేక్షణలో యస్యఫ్ఐ, యూటీఎఫ్ జిల్లా కమిటీ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రజ్నా వికాసం మోడల్ పరీక్ష ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పుల్లారావు, యస్ యఫ్ ఐ నాయకులు గోపి, బాషా జాహిదా, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.










