
- ఎండియు వాహనదారుడిని తొలగించాలని డిమాండ్
ప్రజాశక్తి- కూనవరం
మండలంలోని పెద్దర్కూర్, కూటూరు రెండు పంచాయితీల పరిధిలోని గండి కొత్తగూడెం గ్రామంతో పాటు సుమారు 8 గ్రామాలకు రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వకపోవడంపై సిపిఎం ఆధ్వర్యాన బుధవారం చింతూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఐటిడిఎ పిఒ చైతన్యకు వినతిపత్రం అందజేశారు. ఎండియు వాహనదారుడు పూసం ప్రసాద్ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య మాట్లాడుతూ ఎండియు వాహనదారుడు ప్రసాద్ ఇంతకు ముందు కూడా ఇలాగే చేశారని, పలు మార్లు బియ్యం విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ నెల కూడా ఇంకా బియ్యం ఇవ్వలేదన్నారు. ఎందుకు ఇవ్వలేదని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడన్నారు. గతంలో ఇతనిపై విఆర్ఓకి, తహశీల్దారుకు ఫిర్యాదు చేశామని, అయినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. తక్షణమే ఎండియు వాహనదారుడిని తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, సీపీఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, తమ్మయ్య, సర్పంచ్ బొగ్గా వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.