
ప్రజాశక్తి - మాచర్ల : పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో వరికపూడిశెల ఎత్తిపోల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 15న శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, ఎస్పీ రవిశంకర్రెడ్డి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పరిశీలించారు. సాగర్ రహదారిలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో హెలిపాడ్ ఏర్పాటుకు, గుంటూరు రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సమీపంలో ఉన్న పొలాల్లో సభ నిర్వహణకు స్థలాలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో వైసిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎం.చినఏసోబు, మున్సిపల్ కమిషనర్ ఇవి రమణబాబు, మాజీ చైర్మన్లు టి.కిషోర్, బి.రఘురామిరెడ్డి, నాయకులు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.