ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్
రాష్ట్రంలో అసమానతల్లేని అభివృద్ధి జరగాలని కోరుతూ సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 15న విజయవాడలో చేపట్టే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయి కోరారు. గురువారం కర్నూలు నగరంలోని సుందరయ్య భవన్లో 'చలో విజయవాడ' గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారాలు వేశాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వలసలను నివారించాలని, ఉపాధి హామీ చట్టం కింద 200 రోజులు పనిదినాలు కల్పించాలని, రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని తెలిపారు. ప్రజా సమస్యలన్నీ పక్కకెళ్లి కేవలం రాజకీయ నాయకుల చుట్టూ రాష్ట్ర రాజకీయాలకు తిరుగుతున్నాయని, ప్రజా సమస్యలే అజెండాగా ప్రజల ముందు పెట్టడానికి సిపిఎం ప్రజారక్షణ భేరి నిర్వహిస్తోందని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.రామాంజనేయులు, కెవి.నారాయణ, రామకృష్ణ, నగర కార్యదర్శి రాజశేఖర్, రాముడు పాల్గొన్నారు.
గోడపత్రికను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు