15 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
టిటిడి, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈవో సమీక్ష
ప్రజాశక్తి - తిరుమల
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జిల్లా కలెక్టర్ వెంకట్రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డితో కలిసి ఈవో బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబరు 14వ తేదీ అంకురార్పణతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అక్టోబరు 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మౌత్సవాలలో వయోవద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో చెప్పారు. 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరన్నారు. '' గరుడసేవనాడు గరుడ వాహనాన్ని వీక్షించేందుకు ముందు రోజు రాత్రి నుండే అసంఖ్యాకంగా భక్తులు గ్యాలరీలలో వేచి ఉంటారన్నారు. కావున భక్తుల సౌకర్యార్థం గరుడ వాహనాన్ని ముందుగా ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను అర్చకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు'' ఆయన తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించడానికి టీటీడీతో సమన్వయం చేసుకొని అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, సిఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కలెక్టర్, ఎస్పీలతో కలిసి బ్రహ్మోత్సవాలపై ఈవో సమీక్ష










