రాజంపేట అర్బన్: ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ జిల్లా రెండవ ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్లీనర్ సమావేశాల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో జరుగుతున్న జిల్లా రెండో సమావేశాలు జయప్రదం కోసం విద్యార్థులు, మేధావులు సూచనలు, సలహాలతో పాటు భవిష్యత్తు విద్యార్థి ఉద్యమ నిర్మాణం, విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంతో పాటు ఎన్సీఈఆర్టీ తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను పూర్తిగా అందించడంలో విఫలమయ్యారన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఉపయోగపడని విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ప్రభుత్వం దీన్ని అమలు చేయడం చాలా దారుణమని తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 5000 టీచింగ్ పోస్టుల ఖాళీగా ఉన్నాయని, సరిపడా మౌలిక వసతులు లేక అనేక తీవ్ర ఇబ్బందులతో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. సంక్షేమ హాస్టల్లో చాలా బిల్డింగులు శిథిలా వ్యవస్థకు చేరాయని తెలిపారు. ఈ సమస్యలు అన్నింటి పైన జరగబోయే ప్లీనరీ సమావేశాల్లో చర్చించి భవిష్యత్ కార్యక్రమాలకు వేదిక అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, నాయకులు ఇస్మాయిల్, ఉపేంద్ర, సిరజ్, రాము, గోవర్ధన్, సురేంద్ర, మహేష్, అజరు, విదిష్, గోవర్ధన్, శివ పాల్గొన్నారు.










