
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : అండర్ - 19 పురుషుల వన్డే క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఈనెల 12వ తేదీ నుంచి మంగళగిరి, మూలపాడు క్రికెట్ స్టేడియం లలోని మూడు వేదికల్లో ప్రారంభం కానున్నా యని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపీనాథ్రెడ్డి తెలిపారు. మంగళగిరి అంతర్జా తీయ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే టోర్నీలో భాగంగా మూల పాడులో ఉన్న డీవీఆర్, సీపీ గ్రౌండ్, మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, మేఘాలయ, హైదరాబాద్, ఉత్తరాఖండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయని వెల్లడించారు. మ్యాచ్ తిలకించాలనే వారికి ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. మంగళగిరి స్టేడియంలో మరో ఆరు నెలల పాటు సందడి నెలకొనేలా మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించి బీసీసీఐ ఈ టోర్నీని రాష్ట్రానికి కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇందులో భాగంగానే రూ.15 కోట్లతో మంగళగిరి స్టేడియంలో ప్లడ్ లైట్లు వేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏసీఏ జాయింట్ సెక్రటరీ ఎ.రాకేష్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు కె.వి. పురుషోత్తంరావు, ఎన్.గీత, గుంటూరు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పప్పి, సీఈఓ డాక్టర్ ఎం.వెంకటశివారెడ్డి, సెంట్రల్ జోన్ అకాడమీ కన్వీనర్ డి.రమేష్ కుమార్ పాల్గొన్నారు.