
ప్రజాశక్తి-చింతూరు
రైతులు ఎంతో ఆశతో వేసిన వరి, అపరాలు, పత్తి, మిర్చి పంటలు వర్షాల్లేక ఎండిపోతున్నాయని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సిపిఎం ఎఎస్ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం చింతూరులో సిపిఎం నాయకులు పల్లపు వెంకట్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ రైతులు అప్పులు చేసి పంటలు వేశారని వర్షాలు లేక పంటలన్నీ ఎండి పోవడంతో వారంతా దిక్కు తోచని స్థితిలో వున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నదులున్నప్పటికీ ప్రభుత్వం ఆ నీటిని వ్యవసాయానికి మళ్లించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. అనేక చోట్ల ఉన్న లిప్ట్ ఇరిగేషన్లు పాడైపోగా, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వారికి మరమ్మతులు చేయకపోవడంతో రైతులకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు 11 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని, పాడైన లిఫ్ట్ ఇరిగేషన్లు, చెరువులకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర అధికార బృందాలు ఈ ప్రాంతాలలో పర్యటించి ఎండి పంటను పరిశీలించాలని, సచివాలయాల ద్వారా పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి నమోదు చేయాలని కోరారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, లోతా రామారావు, పూనెం సత్యనారాయణ, సీసం సురేష్, మేకల నాగేశ్వరరావు, పాయం సీతారామయ్య, సోయం చినబాబు తదితరులు పాల్గొన్నారు.