ప్రజాశక్తి-కూనవరం
అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే డిమాండ్స్ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు ఎఎస్ఆర్ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పిలుపునిచ్చారు. గురువారం కూనవరం మండల కేంద్రంలో మడెం అన్నపూర్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ వైఎస్.జగన్ ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వేతనాల కంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాలని, సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐసిడిఎస్ను రక్షించాలని కోరారు. పై డిమాండ్లపై ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నాలు జరుగుతున్నాయని, ఇక్కడ చింతూరు, రంపచోడవరం ఐటిడిఎ కేంద్రాల వద్ద నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ డిమాండ్స్ డే కార్యక్రమాల్లో అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు పూనెం సత్యనారాయణ, కొమరం పెంటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగమ్మ, నాయకులు సూర్యకుమారి, రాజేశ్వరి, ప్రసన్న, లలిత, నాగమణి, సుజాత, ముత్తమ్మ, లక్ష్మి, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.










