Aug 28,2023 09:21

కోల్‌కతా : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మరణించిన ఘోర ఘటన పశ్చిమ బెంగాల్‌ లో చోటు చేసుకుంది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి భవనం పైకప్పు కూలింది. ఘటనాస్థలంలో మృదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే.. ఈ ఫ్యాక్టరీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇళ్ల మధ్యలో నిర్వహిస్తున్నారని సమాచారం. పశ్చిమబెంగాల్‌ స్టేట్‌ యూనివర్సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ప్రమాదం నేపథ్యంలో సమీప ఇళ్లలో నివసిస్తున్నవారిని అధికారులు అప్రమత్తం చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.