ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్టిసి ఉద్యోగులకు సంబంధించి 15 నెలలుగా పెండింగులో వున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. ఈ మేరకు సోమవారం ఆర్టిసి ఎమ్డి ద్వారకా తిరుమలరావుకు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జివి నర్సయ్య వినతిపత్రం అందజేశారు. ఆర్టిసి ఉద్యోగులకు సంబంధించి సస్పెండ్, రిమూవల్ కేసుల్లో అప్పీల్కు అవకాశం లేకుండా వుందని, తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల క్రమశిక్షణ చర్యలపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు విడుదల చేసేలా ఆర్టిసి యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. కాండాక్, సిసిఎలకు సంబంధించిన నిబంధనలు విడుదలైనా అధికారులు పట్టించుకోకుండా ఉద్యోగులను వేధిస్తున్నారని అన్నారు. కొంత మంది ఉద్యోగులు అప్పీల్కు పోకుండానే మానిసిక ఒత్తిళ్లతో అనారోగ్యానికి గురై మృతిచెందుతున్నారని వివరించారు. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఆర్టిసి యజమాన్యం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.










