Aug 05,2023 12:05

తెలంగాణ : తెలంగాణలో రాజ్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్‌ వెంటనే ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ ... రాజ్‌భవన్‌ ముట్టడికి ర్యాలీగా ఆర్టీసీ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గవర్నర్‌ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన వేళ ... రెండు గంటలపాటు బస్సులను బంద్‌ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్‌ ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్టీసీ యూనియన్‌ నేతలను చర్చలకు గవర్నర్‌ ఆహ్వానించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు రాజ్‌భవన్‌లోకి అనుమతి రావడంతో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి.