పెద్దపల్లి (తెలంగాణ) : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 25మందికి తీవ్రగాయాలైన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో సోమవారం జరిగింది. వివాహ వేడుకకు హైదరాబాద్ వెళ్లిన బస్సు రామగుండంకు తిరుగు ప్రయాణమైంది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్దకు రాగానే ఆటోను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70మంది ఉన్నారు. వీరిలో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలినవారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎసిపి మహేశ్, సిఐ జగదీశ్, పోలీసు సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడినవారిని సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










