Jul 01,2022 06:44

''అసత్యాలను వేటాడటం నా వృత్తి. ఇది మెప్పు లేని వృత్తి. సత్యం అర్థవంతమైందే కాని, దాన్ని ఎవరో ఒకరు చెప్పాలి కదా? సత్యాసత్య విచక్షణా జ్ఞానం నాకు అలవడిన నాటి నుండీ, నేను అసత్యాలను వేటాడుతూనే ఉన్నాను...పేరు, ప్రతిష్టలకు పాకులాడటం వల్ల ప్రయోజనం లేదు. మామూలు ప్రజల అజ్ఞానాన్ని, దురభిమానాన్ని ఉపయోగించుకోవడం వల్ల, ఈ దేశంలో తేలికగా పలుకుబడి వస్తుంది. తమ అనుచరులను మోసం చేయడం వల్ల కొందరు సులభంగా విజయులవుతారు. సంప్రదాయం ఎప్పుడూ అనుచరుల్ని తప్పుదారిన నడిపిస్తూ ఉంటుంది. గతం మీద విప్లవం తెస్తేనే తప్ప, భవిష్యత్తును జయించలేం! అందుకే అభ్యుదయ కాముకులు పేరు ప్రతిష్టల కోసం పాకులాడరు.'' - యం.ఎన్‌.రారు (ద ఐడియల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌హుడ్‌)
    ఈ దేశంలో ఆదివాసీ హక్కులను నీరు గార్చిన పార్టీ, అటవీ హక్కుల చట్టాన్ని దారుణంగా దెబ్బతీసిన పార్టీ, రిజర్వేషన్లకు గండికొట్టిన పార్టీ, గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోసిన పార్టీ, సుప్రీంకోర్టు తీర్పు అనే గంగా జలంతో మోడిని కడిగిన ముత్యంలా బయటికి తెచ్చుకున్న పార్టీ, ఇప్పుడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వెతికి వెతికి ఓ ఆదివాసీ మహిళను అధ్యక్ష పదవికి నిలబెట్టుకుంది. వీటన్నిటి వెనక ఉన్న కుట్ర కోణాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దేశాధ్యక్ష పదవికి ద్రౌపది ముర్మును నిలబెట్టిన పార్టీ దేశ ప్రజలకు చాలా విషయాలు చెప్పదు. ఆదివాసీ మహిళ అని గొంతెత్తి చెప్పడమే గానీ, ఆమె కనీసం ఆదివాసీలకు ఏం చేశారో చెప్పదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా పనిచేసిన ఆమె తన స్వంత ఊరికి కనీసం కరెంటు ఇప్పించలేదు. ఆమె అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసిన మరునాడు ఇక పరువు పోతుందని తొందరపడి ఒడిశాలోని మయూర్‌ భంజ్‌ జిల్లా కుసుం సమితి లోని ఆమె స్వగ్రామం ఉపరబెడ-లో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుకు గోతులు తవ్వారు. స్వాతంత్య్రం లభించిన డెభ్భై అయిదేళ్ల తర్వాతనా ఆ ఊరికి విద్యుత్‌ వెలుగులు అందేదీ? 2006 జనవరి 2న ఒడిశా లోని కళింగ్‌ నగర్‌లో ఓ సంఘటన జరిగింది. అక్కడ టాటా స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆదివాసీల భూమిని లాక్కున్నారు. ఆదివాసీలు తిరగబడ్డారు. అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న బిజెడి-బిజెపి సంయుక్త కూటమి ప్రభుత్వం పోలీసు కాల్పులు జరిపించింది. పదమూడు మంది గిరిజనులు తూటాలకు బలయ్యారు. ఆ ప్రభుత్వంలో ద్రౌపది ముర్ము మంత్రిగా ఉండి కూడా నోరు మెదపలేదు. ఇక ఈమె మోడీ భజన చేయడం తప్ప దేశ ప్రజల గూర్చి ఆలోచిస్తారని ఎవరనుకుంటారూ?
     ఒక పరిశోధకుడు చాలా కష్టపడి వైఫ్‌ని కంట్రోల్‌ చేసే రిమోట్‌ కనుగొన్నాడు. కానీ ఎవరికీ అమ్మలేకపోయాడు. కారణం ఏమిటంటే అమ్మడానికి ఆయనకు ఆయన గారి వైఫ్‌ పర్మిషన్‌ ఇవ్వలేదట! పాపం! ఆయనకు ఎంత లాసో కదా? అనుకున్నారు అంతా. ఇటీవల ఒకాయన వరుసబెట్టి దేశంలోని సంస్థలన్నీ అమ్ముతున్నాడు. ఎందుకంటే ఆయనకు వైఫ్‌ పర్మిషన్‌ అక్కరలేదు. ముందుచూపుతో ఆయన భార్యను ముందుగానే ఎప్పుడో వదిలించుకున్నాడు. మిత్రోు అంటూ దేశవాసులకు నైతికత గూర్చి, ధర్మం గూర్చి ఇప్పుడు సుద్దులు కూడా చెపుతున్నాడు. నరేంద్ర మోడీ అనే స్కూలు విద్యార్థి వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడట. అయితే కెమెరా అతనికి ఫస్ట్‌ ప్రయిజ్‌ ఇచ్చారట! ఆ అబ్బాయి ప్రధాని అయిన తర్వాత కూడా ప్రయిజులన్నీ కెమెరా వాళ్ళకే దక్కుతున్నాయట!-విచిత్రం? మోడీ తన అమ్మమ్మను గుర్తుచేసుకుంటూ ఆమె స్పానిష్‌ ఫ్లూతో 1920లో మరణించిందని చెప్పారు. దాని కిందనే మరో పేరాలో తన తల్లి 1923లో పుట్టిందని రాశారు. గణిత శాస్త్రంలో విశ్వగురువు అంటే ఇదేనా? - అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి 'మోడీకి లెక్కలు రావు - ఆయనకు ఆర్థికరంగం గూర్చి ఏమీ తెలియద'ని - అన్నది ఇందుకేనా? అని జనం ఆలోచనలో పడ్డారు.
     ''కొలనులో స్నానం చేస్తుండగా ఓ మొసలి పిల్లను చూశాను. దాన్ని ఇంటికి తీసుకువెళితే అమ్మ తిట్టింది. అందువల్ల వెంటనే వెళ్ళి దాన్ని కొలనులో విడిచి వచ్చాను'' అని భారత ప్రధాని మోడి 2019లో ఒక టీవీ కార్యక్రమంలో చెప్పుకున్నారు. అదొక గొప్ప సాహసవంతమైన కార్యక్రమంగా కొన్ని ప్రయివేటు పాఠశాలల్లోని ఒకటవ తరగతికి పాఠ్యాంశంగా పొందుపరిచారు. ఆయన స్థాయి ఆ మాత్రమే కాబట్టి, ఆ పాఠం ఆ క్లాసుకే ఉండటం న్యాయమని భావించారేమో? పెద్ద తరగతికి ఆ పాఠం పెడితే - 'అందులో సాహసమేముంద'ని విద్యార్థులు ప్రశ్నలు కురిపిస్తారేమోనని జంకినట్టున్నారు! అయినా గుజరాత్‌లో తను బాల్యంలో చారు అమ్మానని చెప్పుకున్న రైల్వేస్టేషన్‌ వివరాల కోసం పత్రికలవాళ్ళు వెతికితే తెలిసిందేమంటే, ఆయన చారు అమ్మానని చెప్పుకున్న కాలంలో అక్కడ రైల్వేస్టేషనే లేదని! లేని స్టేషన్‌లో చారు ఎలా అమ్మారూ? ఈ విషయాన్ని ఒక హిందీ కవి పాటగా రాసి ప్రచారం చేశాడు. ''చారు బేచ్‌దో / రేల్‌ బేచ్‌దో / తేల్‌ బేచ్‌దో / జహాజ్‌ బేచ్‌దో / కొయీ సవాల్‌ కరే / ఉసే జైల్‌ బేజ్‌దో!! హోంమత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటిస్తూ అల్లూరి సీతారామరాజు హైదరాబాద్‌ నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడని చెప్పారు. మతి స్థిమితం కోల్పోయిన వారి మాటల్లాగా ఉన్నాయేమిటీ? మన మంత్రుల ఉపన్యాసాలూ? - అని జనం లోలోన పిసుక్కుని ఛస్తున్నారు. ఈ దేశంలో నసిరుద్దీన్‌ షా ముస్లిం. అమిత్‌ షా హిందూ. స్మృతి ఇరానీ హిందు, సోనియా గాంధీ ఇటాలియన్‌? ఈ దేశంలో ఏదైనా సాధ్యమే!
     ఒకానొకప్పుడు జర్మనీలో ఒక ప్రముఖ కవిని అరెస్టు చేశారు. అప్పుడు అతని ఐదేళ్ల కూతురు తల్లిని ఇలా అడిగింది... ''అమ్మా! నాన్నను పోలీసులు ఎందుకు తీసుకుపోతున్నారూ?'' అని.
అందుకు తల్లి అంది కదా ''మీ నాన్న హిట్లర్‌ని విమర్శిస్తూ కవిత్వం రాశారు - అందుకని!''
''అదేమిటీ? హిట్లర్‌ కూడా నాన్నను విమర్శిస్తూ ఓ కవిత రాయొచ్చు కదా?'' అంది కూతరు అమాయకంగా.
''ఆయనకు అంత తెలివే ఉంటే, ఇంక చెప్పేదేముందీ? చదువూ విజ్ఞత లేని మూర్ఖులే రక్తపాతం సృష్టిస్తారు. ప్రశ్నించే వారిని అరెస్ట్‌ చేస్తారు. ఒక్కోసారి చంపేస్తారు కూడా!'' - అని చెప్పింది.
అగ్నిపథ్‌ని నిరసిస్తూ దేశంలోని యువత పలు రాష్ట్రాల్లో నిరసనకు దిగి, జరిపిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరో సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు. అది ఇలా ఉంది...దేశ ప్రధాని దేశ ప్రజలకు నమస్కరిస్తూ- ''దయచేసి ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టకండి! నాకు అమ్మడానికి ఇబ్బందవుతుంది'' - అని! ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఉంది. అందులో వ్యంగ్యం ఉన్నా... వాస్తవం కూడా ఉంది కాబట్టి జనం హర్షించారు! ఇలాంటి అంశాల మీద మన్‌ కి బాత్‌ - వినిపించదేమీ? చోద్యం?
బిజెపి అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ, మరో సభ్యుడు నవీన్‌ కుమార్‌ జిందాల్‌ మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా అరబ్‌ దేశాలు మండిపడ్డాయి. భారతీయ ఉత్పత్తులను తమ దేశాలలో నిషేధించినంత పని చేశాయి. భారత ప్రధాని ఫొటోలు అక్కడి చెత్తకుండీలపై అతికించి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. ఈ రకంగా దేశ 'గౌరవాన్ని' ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తం చేసింది? దేవుణ్ణి, మతాల్ని, అంధ విశ్వాసాల్ని వదిలించుకునే స్థాయి ఈ ప్రభుత్వానికి ఎలాగూ లేదు. కనీసం పరమత సహనమైనా ఉండాలి కదా?
    భారతదేశంలో ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించిందని, బలవంతంగా ఆ రోజుల్లో మత మార్పిళ్లు జరిగాయని ఆరెస్సెస్‌-బిజెపి వంటి సంస్థలు ఊరికే వాదిస్తుంటాయి. కానీ, వారి వాదనలో పసలేదు. చరిత్ర తెలిసిన వారు ఈ విషయం అంగీకరించరు. స్వామి వివేకానంద కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆయనే స్వయంగా ఒక చోట ఇలా రాశారు... ''భారతీయులు (హిందువులు) ఖడ్గ భయంతో మహ్మదీయులుగా మారారు-అనడంలో యదార్థం లేదు-అది అవాస్తవం!'' అని రాశారు. ''ఒకవైపు హిందూ మతాచార్యుల కఠిన నిబంధనల వల్ల, మరొక వైపు జమీందారుల అణచివేత, హింసాత్మక చర్యల వల్ల కొందరు హిందువులు ఇస్లాం స్వీకరించారు. అంతేకానీ, ముస్లిం రాజులు మెడ మీద కత్తి పెట్టి మత మార్పిళ్లు జరిపించలేదు. వివేకానందుడు ఈ విషయం ఒక లేఖలో ప్రస్తావించాడు. అలాగే మరోసారి, మరో శిష్యుడికి రాసిన ఉత్తరంలో ఇలా రాశాడు... ''నాయనా!ఏ మనిషి గానీ, ఇతరులను ద్వేషిస్తూ మనుగడ సాగించలేడు. అదే విధంగా ఏ జాతైనా ఇతరులను ద్వేషిస్తూ బతకలేదు. ఏనాడైతే మన వాళ్ళు (వైదికులు) ''మ్లేచ్ఛ'' అనే శబ్దాన్ని సృష్టించారో, ఇతరులతో రాకపోకలు విరమించారో - అప్పటి నుండే భారతదేశానికి దౌర్భాగ్యం దాపురించింది. ఆ ద్వేషాన్ని నిర్మూలించడానికి అందరూ జాగృతం కావాలి! ఏకీకృతం కావాలి!! (వివేకానంద లేఖావళి పేజి:158-159)
''దేశమంటే సామాన్యులు! సామాన్యుల విద్య, వికాసాలపైన, సాంస్కృతిక పునరుజ్జీవనం పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రజాచైతన్యం ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుంది'' గ్రుండ్‌విగ్‌, (ఫోక్‌ స్కూల్‌ రూపకర్త: డెన్మార్క్‌).
చివరకు మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏమిటంటే... మనుషుల్ని చంపి, మతాన్ని బతికిస్తామనే రోజులు చచ్చిపోవాలి. మతాన్ని నాశనం చేసి, మానవత్వాన్ని నిలబెడదామనే రోజులు వికసించాలి! అప్పుడుగానీ, ఈ భూమి మీద మనిషి ప్రశాంతంగా బతకలేడు.

/వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త/
డా|| దేవరాజు మహారాజు

డా|| దేవరాజు మహారాజు