Oct 27,2023 10:01
  • బేయర్‌, అమెజాన్‌తో ఐకార్‌ ఒప్పందం
  • రద్దు చేయాలని కిసాన్‌ సభ డిమాండ్‌

న్యూఢిల్లీ : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టే చర్యలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముమ్మరంగా సాగిస్తోంది. మూడు చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌కు ధారాదత్తం చేసేందుకు మోడీ సర్కార్‌ చేసిన కుట్రను మహత్తర రైతాంగ ఉద్యమంతో అన్నదాతలు తిప్పికొట్టిన నేపథ్యంలో దొడ్డిదారి మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా బేయర్‌, అమెజాన్‌ కిసాన్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజ కంపెనీలతో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్‌) ఇటీవల పలు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయు)ను కుదుర్చుకుంది. వ్యవసాయ పరిశోధన రంగాన్ని, వ్యవసాయోత్పత్తుల మార్కెంటింగ్‌ను గంపగుత్తగా కంపెనీలకు అప్పగించేందుకు కుతంత్రులు సాగిస్తోంది. కార్పొరేట్‌ సంస్థలతో వ్యవస్థాగత భాగస్వామ్యాన్ని చిన్న కమతాల రైతులకు సాధికారత కల్పించేందుకు జరిగిన ప్రయత్నమంటూ ఐసిఎఆర్‌ ఒక బూటకపు కథనాన్ని సృష్టిస్తోంది. పంటలు, పంట రకాలు, పంటల రక్షణ, కలుపు, యాంత్రీకరణ కోసం సమర్ధవంతమైన వనరులు, వాతావరణ పరిస్థితులకు సరిపోయే పరిష్కారాలను అభివృద్ధిపరచడం కోసం బేయర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎంఓయు పేర్కొంటోంది. అంతకుముందు దానిమ్మ పంట సాగుపై కూడా ఐసిఎఆర్‌, బేయర్‌ మధ్య ఇలాంటి పరిశోధనా సహకార ఒప్పందం కుదిరింది. ఇటువంటి ఎంఓయులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలించి చూసినట్లైతే, ఐసిఎఆర్‌కు గల విశ్వసనీయత, నెట్‌వర్క్‌, వనరులను ఇందుకోసం ఉపయోగించడం ద్వారా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలోకి కార్పొరేట్‌ కోరలను చొప్పించేందుకు ఉద్దేశించిన ప్రయత్నంగా కనిపిస్తోంది.
 

                                                            తక్షణమే ఉపసంహరించుకోవాలి : కిసాన్‌సభ

దుర్మార్గమైన ఈ ప్రయత్నాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) డిమాండ్‌ చేసింది. రైతులను నిలువునా దోపిడీ చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బడా వాణిజ్య సంస్థలకు లాభాలు ఆర్జించేందుకు మోడీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోందని కిసాన్‌సభ విమర్శించింది. ఐసిఎఆర్‌, బేయర్‌ ఎంఓయులో ఈ విషయం స్పష్టమవుతోందని తెలిపింది. కార్పొరేట్‌ లాభాలను గరిష్ట స్థాయికి పెంచేందుకు దొడ్డిదారిన కార్పొరేట్‌ అనుకూల నిరంకుశ వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి ఇదొక ప్రయత్నమేనని కిసాన్‌ సభ పేర్కొంది. ఈ కార్పొరేట్‌ సంస్థలు, ఐసిఎఆర్‌తో ఇటువంటి సహకార ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల అపార అవకాశాలు వస్తాయని, వాటితో చట్టబద్ధతను తెచ్చుకుంటారని, తద్వారా లాభాలు గడించేందుకు పెద్ద మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంటారని తెలిపింది. అన్ని కార్పొరేట్‌ సంస్థలతో ఐసిఎఆర్‌ సంతకాలు చేసిన అవగాహనా ఒప్పందాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని ఎఐకెఎస్‌ డిమాండ్‌ చేసింది. తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవడానికి కార్పొరేట్‌ సంస్థలు ప్రభుత్వ వనరులను, సంస్థలను వాడుకోవడాన్ని నివారించాలని కోరింది. దానికి బదులుగా నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనడానికి గానూ వ్యవసాయ పరిశోధనలకు ప్రభుత్వ నిధులను, వనరులను పెంచాలని ఎఐకెఎస్‌ కోరింది. రైతాంగం, శాస్త్రవేత్తలు, మేథావులు వెలిబుచ్చుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నాలన్నింటినీ నిర్ద్వంద్వంగా ప్రతిఘటించాలని కోరింది.